జగన్ వెంటే నడుస్తా: ఎమ్మెల్యే ముస్తఫా


గుంటూరు, న్యూస్‌లైన్: తాను జీవితాంతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడుస్తానని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా స్పష్టం చేశారు. పదవుల కోసం కక్కుర్తిపడి అడ్డగోలుగా నడిచే నైజం తనది కాదన్నారు. తొలినుంచి నిజాయితీగా రాజకీయంగా ఎదిగానన్నారు. గుంటూరులో బుధవారం విలేకరుల సమావేశంలో ముస్తాఫా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి వెళుతునట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.



ఎటువంటి నిర్ధారణ లేకుండా పలు మీడియాల్లో వస్తున్న కథనాలు ఏమాత్రం సబబు కాదన్నారు. రాజకీయంగా తన ఎదుగుదలకు బాసటగా నిలిచిన వైఎస్ జగన్ రుణాన్ని తీర్చుకుంటానని స్పష్టం చేశారు. కొన్ని పార్టీల నేతలు తనపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పలువురు టీడీపీ నేతలు సైతం లేనిపోని వ్యాఖ్యలు చేయటం అర్థరహితమన్నారు.

 

ఎంపీని మర్యాదపూర్వకంగానే కలిశాను..

గతంలో ఉన్న రాజకీయ పరిచయంతోనే తాను తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీని మర్యాదపూర్వకంగా కలిశానని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఎమ్మెల్యే సమాధానమిచ్చారు. ఇందులో ఎలాంటి దురుద్దేశమూ లేదన్నారు. అలా కలిసినంత మాత్రాన లేనిపోని పెడార్థాలు తీయడం ఎంతవరకు సబబని ముస్తఫా ప్రశ్నించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top