ఎమ్మెల్యే రోజాపై దాడి అమానుషం
కర్నూలు(ఓల్డ్సిటీ): వైఎస్ఆర్సీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, చిత్తూరు జిల్లా నగరి శాసన సభ్యురాలు రోజాపై దాడి అమానుషమని వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా నాయకురాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎస్బీఐ సర్కిల్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద శనివారం ధర్నా నిర్వహించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎ.నారాయణమ్మ మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రోజాపైనే టీడీపీ నాయకులు దాడి చేశారంటే ఆ పార్టీ నాయకులు ఎంతగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారో అర్థమవుతుందన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న మహిళపైనే దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వంలో ఇక సాధారణ మహిళలకు ఎక్కడ రక్షణ కల్పిస్తుందని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు ప్రోద్భలంతోనే ఆ పార్టీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా ఉండి, ప్రజాసమస్యలపై గళం విప్పుతున్నారనే అక్కసుతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కూడా బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు సత్యవేదమ్మ, జిల్లా నాయకురాళ్లు ఎస్తేర్రాణి, మద్దమ్మ, షాకిరా, బీజాన్బీ పాల్గొన్నారు.