పక్షపాత వైఖరి విడనాడాలి : కళావతి


వీరఘట్టం (వండువ) : అర్హులైన ప్రతి ఒక్కరికీ బీసీ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం చెబుతుంటే అందుకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి మండిపడ్డారు. సోమవారం స్వగ్రామం వండువలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ వారు సూచించిన వారికే రుణాలు మంజూరు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తుండడం సిగ్గు చేటన్నారు.

 

 అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారంటూ రుణాలకు దరఖాస్తు చేసుకున్న కొంతమంది దరఖాస్తులను బుట్టదాఖలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అధికారులు నిస్పక్షపాతంగా వ్యవహరించి అర్హులైన వారికి బీసీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాలను అందజేయాలని ఆదేశించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాసే అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని చెప్పారు. ఇకనైనా పనితీరు మార్చుకోవాలని హితవు పలికారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top