'రాజధాని భూసమీకరణపై సుప్రీం తీర్పు హర్షణీయం'
హైదరాబాద్: సీఆర్డీఏ ద్వారా రాజధాని భూ సమీకరణను వ్యతిరేకిస్తూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, సోమవారం రైతుల పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేయడం హర్షణీయమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. సోమవారం అసెంబ్లీ వాయిదా పడిన వెంటనే మీడియా పాయింట్లో మంత్రి నారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. న్యాయస్థానాల ద్వారా రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడం తగదని హితవు పలికారు.
రాజధాని నిర్మాణానికి కేవలం 1,100 ఎకరాలు మాత్రమే కావాల్సి ఉందని, ఈ భూమిని సమీకరణ పద్ధతి ద్వారా సేకరిస్తామని ప్రకటించారు. 33 వేల ఎకరాలను భూ సమీకరణ కింద అప్పగించిన రైతులు మిగిలిన భూమిని తమంతట తామే అప్పగిస్తారన్న నమ్మకం తమకుందన్నారు. సుప్రీంకోర్టు రైతుల వ్యాజ్యాన్ని కొట్టేయడం రాజధాని నిర్మాణానికి శుభసూచకమని మంత్రి నారాయణ ఈ సందర్భంగా అన్నారు.