1999 గ్రూప్ 2 పోస్టులకు మెరిట్ జాబితా
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1999 గ్రూప్ 2 నోటిఫికేషన్లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 16 ఏళ్ల అనంతరం 927 మందితో కూడిన మెరిట్ జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తిరిగి రూపొందించింది. ఈ జాబితాను బుధవారం రాత్రి ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి ప్రకటించారు. జోన్ల వారీగా, పోస్టుల వారీగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్సైట్ ‘పీఎస్సీ.ఏపీ.జీఓవీ.ఇన్’లో పొందుపరిచారు.
నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కూడా త్వరలోనే మెరిట్ జాబితాను ప్రకటిస్తామని సాయి వివరించారు.ఇలా ఉండగా 2011 మెయిన్స్ ఫలితాలను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించడానికి ఏర్పాట్లు పూర్తిచేసింది. బుధవారం రాత్రి ఏ సమయానికైనా ఈ ఫలితాలను ప్రకటించనున్నామని కార్యదర్శి వివరించారు. మొత్తం 151 గ్రూప్1 పోస్టులకు మెయిన్స్ ద్వారా 291 అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. వీరికి ఏప్రిల్ 18 నుంచి మే 10 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.