‘రిమ్స్’లో వైద్య సేవలు నిల్ !


 శ్రీకాకుళం సిటీ: శ్రీకాకుళంలోని రిమ్స్‌లో మెడికల్ కళాశాల ఉన్నప్పటికీ రోగులకు సరైన వైద్యసేవలు లభించడం లేదని, దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిల్లా కలెక్టర్ నియమించిన కమిటీ నిర్ధారణకు వచ్చింది. శ్రీకాకుళం రూర ల్ మండలం గూడెం గ్రామానికి చెందిన లక్ష్మి ప్రసవం కోసం రిమ్స్ ఆస్పత్రికి రాగా ప్రసూతి విభాగంలో బిడ్డ మృతి చెందిన విషయం వివాదం కావడంతో దీనిపై విచారణకు కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం డీసీహెచ్, డీఎంహెచ్‌వోతో పాటు పలువురితో కూడిన కమిటీని వేసిన విషయం విదితమే. దీనిపై కమిటీ సభ్యులు డీసీహెచ్ ఎం.సునీల, డీఎంహెచ్‌వో ఆర్.శ్యామల, డిప్యూటీ డీఎంహెచ్‌వో శారద సోమవారం రిమ్స్ ప్రసూతి వార్డులో సుమారు మూడు గంటలకు పైగా సిబ్బందిని విచారించారు.

 

  సంఘటన రోజు విధుల్లో ఉన్న వైద్యులు, హౌస్ సర్జన్‌లు, నర్సింగ్ సిబ్బందితో పాటు కిందస్థాయి సిబ్బంది నుంచి తగిన వివరాలను కమిటీ ప్రతినిధి బృందం సేకరించింది. మెడికల్ కళాశాల ఉన్నప్పటికీ ఆస్థాయి వైద్యసేవలు అందించడంలో  జాప్యం జరగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కమిటీ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.  ప్రసూతి విభాగంలో ఫ్రొపెసర్ల కొరతను, సిబ్బంది నిర్లక్ష్యం తదితర అంశాలను కూడా పరిగణలోనికి తీసుకుంది. పూర్తిస్థాయి నివేదికను కలెక్టర్‌కు నివేదించనున్నట్లు డీసీహెచ్ సునీల ‘సాక్షి’కి తెలిపారు. ఇదిలా  ఉండగా ప్రసూతి వార్డులో జరిగిన సంఘటనపై రిమ్స్ డెరైక్టర్ తెన్నెటి జయరాజ్ ఆ వార్డులో పనిచేస్తున్న మ్యాటీ అసిస్టెంట్ ప్రభావతి, ఎఫ్‌ఎన్‌వో కె సావిత్రిలను విధుల  నుంచి సస్పెండ్ చేశారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top