మాఫీ మాయ


 సాక్షి ప్రతినిధి, ఏలూరు :రుణమాఫీ మాయాజాలంలో సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతులూ చిక్కుకున్నారు. తీసుకున్న రుణం మాఫీకాక.. కొత్త అప్పులు పుట్టక.. బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా ముద్ర వేయించుకుని బంగారు నగల వేలం

 నోటీసులతో పరువు పోగొట్టుకున్న అన్నదాతలు అల్లాడిపోతున్నారు. సొసైటీల నుంచి రుణాలు తీసుకున్న రైతుల్లో సగం మంది రుణాలైనా మాఫీ కాని పరిస్థితి నెలకొంది.

 

 256 సొసైటీలు.. 2.10 లక్షల మంది రైతులు

 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పరిధిలో 256 సహకార సంఘాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 2 లక్షల 10 వేల మంది రైతులు వీటిద్వారా రూ.1,100 కోట్లను పంట రుణాలుగా పొందారు. రుణమాఫీ జాబితాలో లక్షన్నర మంది రైతుల పేర్లు మాత్రమే నమోదు కాగా, ప్రభుత్వం కేవలం రూ.190 కోట్లు విడుదల చేసింది. ఆధార్ కార్డులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు, రేషన్ కార్డులు లేవనే నెపంతో కొన్ని పేర్లు, జాబితాలను సరైన సమయంలో అందించలేదన్న సాకుతో మరికొన్ని పేర్లు రుణమాఫీ అర్హత జాబితా నమోదు కాలేదు. ఇలా 60వేల మంది రైతుల పేర్లకు సర్కారు కోత పెట్టింది. కాగా, డీసీసీబీకి ప్రభుత్వం కేటాయించిన రూ.190 కోట్లలో రూ.50 వేల లోపు రుణాల మాఫీ నిమిత్తం రూ.128 కోట్లు మంజూరయ్యూరుు. రూ.50 వేలు పైబడి రుణాలు తీసుకున్నవారికి 20 శాతం కింద రూ.62 కోట్లు వచ్చింది. మొత్తం రూ.190 కోట్లలో ఇప్పటికి 20 శాతం డబ్బు కూడా రైతుల ఖాతాలకు జమ చేయలేదు. రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతుల ఖాతాలకు మాఫీ సొమ్మును నాలుగు రోజుల నుంచి జమ చేస్తున్నామని అధికారులు చెబుతున్నా, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది.

 

 రూ.50 వేల రుణం దాటిన వారికి పైసా ఇస్తే ఒట్టు

 సహకార సంఘాల్లో  రూ.50 వేలకు పైగా రుణం తీసుకున్న రైతుల ఖాతాలకు ఇంతవరకు ఒక్క పైసా కూడా అధికారులు జమ చేయలేదు. ఆ రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపచేసి పట్టాదార్ పాస్ పుస్తకంలో ఉన్న పొలం ఆధారంగానే మాఫీ సొమ్ము అందించాలని బ్యాంక్ అధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సాధారణంగా సొసైటీలో సొంత భూమితోపాటు కౌలు భూమిని జతచేసి ఈ మొత్తం భూమికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపచేసి రుణం ఇస్తూ ఉంటారు. అయితే పట్టాదార్ పాస్ పుస్తకంలో ఆ రైతు సొంత భూమి వివరం మాత్రమే ఉంటుంది. రుణమాఫీ సొమ్మును పాస్ పుస్తకం ప్రకారం ఇస్తే రైతులకు మాఫీ సొమ్ములో కోత పడుతుంది. అర్హులైన రైతులకు ఇప్పటికే సెల్‌ఫోన్ మెసేజ్‌ల ద్వారా రుణమాఫీ మొత్తం వివరాలు తెలిశాయి.

 

 ఇప్పుడు కేటాయించిన దాంట్లో కోత పెడితే రైతుల్లో ఎక్కడ ఆందోళన వస్తుందోనని బ్యాంక్ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ కారణంగానే20 శాతం లబ్ధిదారులను పూర్తిగా పక్కన పెట్టి రూ.50 వేలలోపు రుణాలున్న రైతులకు మాత్రమే సొమ్ము పంపిణీ మొదలుపెట్టారు. అది కూడా మందకొడిగానే సాగుతోంది. జిల్లాలో సహకార సంఘాల ద్వారా రూ.50 వేల లోపు రుణాలు పొందిన రైతులు సుమారు 80 వేల మంది ఉండగా, ప్రస్తుతానికి 37 వేల మంది రైతులకు మాత్రమే మాఫీ సొమ్ము విడుదలైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సర్కారు నయామోసంపై నిప్పులు చెరిగేందుకు సహకార రైతులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా అన్నదాతల సమస్యలపై దీక్ష చేపట్టనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి నడవాలని వారంతా నిర్ణయించారు. ఈ నెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో తణుకులో చేపట్టనున్న దీక్షకు పోటెత్తాలని రైతులు భావిస్తున్నారు.

 

 చంద్రబాబు మాటలకు మోసపోయూం

 మాది మొగల్తూరు మండలం పడమటిపాలెం. నాకు అర ఎకరం పొలముంది. దాంతోపాటు మరో ఎకరం కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తూ.. మరోవైపు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. సొసైటీ నుంచి పంట రుణంగా రూ.50 వేలు తెచ్చాను. నాకు బాకీ ఉండటమంటే ఇష్టం ఉండదు. ఎంత ఇబ్బంది అయినా బాకీ కట్టేస్తాను. కానీ.. రుణమాఫీ చేస్తారనే ఆశతో సొసైటీకి బాకీ కట్టలేదు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జాబితాలో నా పేరు లేదు. అధికారులను అడిగితే కౌలు పొలం కాబట్టేమోనని ఒకరు, రికార్డులు సరిగా లేవమోనని ఇంకొకరు చెబుతున్నారు. వడ్డీలు పెరిగిపోతున్నాయి. అంతా గందరగోళంగా ఉంది. రుణమాఫీ చేస్తామని చెబితే నమ్మి తెలుగుదేశం పార్టీకి ఓట్లేశాం. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం.

 -  పి.శ్రీరాములు, పడమటిపాలెం, మొగల్తూరు మండలం

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top