సుజనా చౌదరిపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: రుణ బకాయి వసూలు కోసం కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై ఉమ్మడి హైకోర్టులో మారిషస్ కమర్షియల్ బ్యాంకు పిటిషన్ వేసింది. 2010లో సుజనా చౌదరికి చెందిన హేస్టియూ కంపెనీ తమ వద్ద నుంచి రూ. 100 కోట్ల మేర రుణం తీసుకుందని పిటిషన్ లో పేర్కొంది. ఈ రుణానికి సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్యారెంటర్ గా ఉందని వెల్లడించింది.
తమకు రావాల్సిన రూ.105 కోట్ల 72 లక్షలు చెల్లించేలా సుజనా చౌదరిని ఆదేశించాలని కోర్టును బ్యాంకు కోరింది. బకాయిలు చెల్లించాలని లండన్ కోర్టు ఆదేశించినా సుజనా చౌదరి పట్టించుకోలేదని బ్యాంకు తెలిపింది. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆస్తులు అమ్మి తమ అప్పు తీర్చేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేసింది. దీనిపై విచారణను కోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది.