'ముఖ్యమంత్రులకు చట్టాలు వర్తించవా...'
ఏలూరు: దళితులను అవమానించిన ముఖ్యమంత్రులకు చట్టాలు వర్తించవా? అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో విలేకరులతో మాట్లాడారు. దళితులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు ఇచ్చినా ఏ పోలీస్ స్టేషన్లోనూ తీసుకోవడం లేదన్నారు. ఫిర్యాదులు స్వీకరించాలని కోరుతూ పోలీస్స్టేషన్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తామన్నారు.
అప్పటికీ స్పందన లేకుంటే కోర్టు తలుపులు తడతామని చెప్పారు. న్యాయం జరగకపోతే చివరికి అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించి నిరసన తెలుపుతామన్నారు. సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సభాస్థలిలో ఏప్రిల్ 30న 10 లక్షల మందితో విశ్వరూప మహాసభ నిర్వహించనున్నట్టు చెప్పారు.