'పుత్రరత్నం పట్టాభిషేకానికే ఇదంతా'

'పుత్రరత్నం పట్టాభిషేకానికే ఇదంతా' - Sakshi


నెల్లూరు(సెంట్రల్): టీడీపీ ఆర్భాటంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం బాబు పుత్రరత్నం లోకేష్ పట్టాభిషేకానికి తప్పా తెలుగు ప్రజలకు ఉపయోగపడేది కాదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ విమర్శించారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇంతవరకు ప్రజలకు ఏమి చేయకుండా ఆర్భాటంగా మహానాడును జరుపుకోవడం ఏమిటో అర్థం కావటం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉదయం లేచింది మొదలు బాబు విదేశాలు పట్టుకుని తిరుగుతూ పెట్టుబడులు పెట్టమని భిక్షాటన చేస్తున్నారని దుయ్యబట్టారు.



ప్రత్యేక హోదా సాధించుకుంటే ఇలా భిక్షాటన చేయాల్సిన అవసరం ఉండదన్నారు. నిజంగా ప్రత్యేకహోదా తేవాలని బాబుకు ఉంటే కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులను వెనక్కు తీసుకుని గట్టిగా పోరాడాలని హితవు పలికారు. కార్మిక హక్కులను కాలరాయడం, రైతుల భూములను బలవతంగా లాక్కోనే భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని చూడటం కేంద్ర సర్కారుకు తగదన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పూర్తిగా అబద్ధాల కోరని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పిన వెంకయ్యనాయుడు ఇప్పుడు మాటమార్చడం చూసి.. జనం ఆయన్ను మాట మార్చిన వెంకయ్యగా పిలుస్తున్నారని ఎద్దేవ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top