ముందు ప్రేమ పెళ్లి.. తర్వాత రెండో పెళ్లి
ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని, మరో యువతితో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడో యువకుడు. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలానికి చెందిన మట్టా నాగభూషణం(27) అనే యువకుడు, కురుమాన కళావతి(24) అనే యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. నాగభూషణం ఐటీడీఏలో టైపిస్ట్గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ప్రేమికులిద్దరూ ఇంట్లో తెలియకుండా గత నెల 14న పారిపోయి సింహాచలం గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఒక ఇల్లు అద్దె తీసుకుని కాపురం పెట్టారు. మూడు రోజుల తర్వాత ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి ఆమెను అక్కడే ఉంచి నాగభూషణం వెళ్లిపోయాడు. వారం రోజులు వేచిచూసినా భర్త నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆ యువతి ఫిబ్రవరి 24న స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
కాగా నాగభూషణం మరో యువతిని వివాహం చేసుకుంటున్నాడని తెలుసుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించడంతో వెంటనే స్పందించిన పోలీసులు వరుడు నాగభూషణం ఇంటికి చేరుకుని పెళ్లిని ఆపేశారు. అయితే వరుడు మాత్రం పరారీలో ఉన్నాడు. విషయం తెలిసిన మహిళా సంఘాలు కళావతికి న్యాయం చేయాలని నాగభూషణం ఇంటి ముందు ఆందోళనకు దిగాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.