వర్షాల వల్ల రైల్వేకు రూ.20 కోట్ల నష్టం
దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా
సత్తెనపల్లి: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైల్వే శాఖకు రూ.20 కోట్ల నష్టం వాటిల్లిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా అన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల వద్ద జరుగుతున్న రైల్వే ట్రాక్ మరమ్మతు పనులను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సత్తెనపల్లి, బెల్లంకొండ రైల్వేస్టేషన్ల పరిధిలో ఎక్కువ నష్టం జరిగిందని, 1,200 మీటర్లు ఒకచోట, 800 మీటర్ల మేర మరోచోట రైల్వే ట్రాక్ దెబ్బతిందని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ మరమ్మతులు చేసేందుకు 100 ప్రొక్లెయిన్లు, వెయ్యి మంది కార్మికులను రంగంలోకి దించామని చెప్పారు.
రూ.1,500 కోట్లతో గుంటూరు రైల్వేస్టేషన్ ఆధునికీకరణ..
గుంటూరు రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు రూ.1500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి పనులు పూర్తి చేస్తామన్నారు. ఆయన వెంట గుంటూరు డీఆర్ఎం విజయశర్మ, డీఐజీ ఈశ్వరరావు, ఆర్థిక సలహాదారు పూర్ణచర్ల, చీఫ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, రైల్వే పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు.