పోలీసు జీపును ఢీకొన్న ఇసుక లారీ
పిట్టలవానిపాలెం/ భట్టిప్రోలు: పోలీసు జీపును ఇసుక లారీ ఢీకొన్న ప్రమాదంలో భట్టిప్రోలు ఎస్ఐ ఎ.మల్లికార్జునరావు, ఇద్దరు సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పిట్టలవానిపాలెం మండలం చందోలు వద్ద సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
చందోలు ఏఎస్ఐ రఫీ తెలిపిన వివరాల ప్రకారం.. భట్టిప్రోలు ఎస్ఐ ఎ.మల్లికార్జునరావు, సిబ్బంది పోలీసు జీపులో సోమవారం బాపట్ల డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. తిరిగి భట్టిప్రోలు వెళుతుండగా చందోలు శివారు నీలిబంగారయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా గల మలుపు వద్ద.. చెరుకుపల్లి వైపు నుంచి బాపట్ల వైపు వెళుతున్న ఇసుకలోడు లారీ పోలీసు జీపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జీపులో ఉన్న ఎస్ఐ మల్లికార్జునరావు తలకు తీవ్రగాయాలుకాగా.. జీపు నడుపుతున్న హోంగార్డు బొర్రా నాగరాజు, కానిస్టేబుల్ యార్లగడ్డ అంకమల్లేశ్వరరావులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో గుంటూరులోని ఓ ప్రైవేటు హాస్పటల్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. ట్రాక్టర్ను తప్పించే ప్రయత్నంలో లారీ స్టీరింగ్ రాడ్ ఇరిగిపోవడంతో ఎదురుగా వస్తున్న పోలీసు జీపును ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు చందోలు ఏఎస్ఐ రఫీ తెలిపారు.