మా అమ్మ ఆచూకీ తెలపండి సార్‌..

భర్త నాగేంద్రతో పార్వతమ్మ (ఫైల్‌)

► కలెక్టర్‌ను కలిసిన చిన్నారులు

► ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లి అదృశ్యమైన మహిళ

► మనోవేదనతో మరణించిన భర్త

 

కడప: కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలవాలని  18 నెలల క్రితం కువైట్‌కు వెళ్లిన అమ్మ ఆచూకీ తెలపాలంటూ  చిన్నారులు అధికారులను వేడుకుంటున్నారు. వైఎస్సార్‌ జిల్లా గాలివీడు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన పార్వతి రెండేళ్ల క్రితం కుటుంబ పోషణ కోసం కువైట్‌కు వెళ్లింది. ఆ ప్రాంతానికి చెందిన ఓ ఏజెంటు ఆమెను కువైట్‌కు పంపాడు. ఇంటి నుంచి వెళ్లిన తర్వాత నెలలు గడిచినా పార్వతి నుంచి ఫోన్‌ కాల్‌ లేదు. గాలివీడు పోలీసుస్టేషన్‌లో ఆరు నెలల క్రితమే  ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. భార్య ఆచూకీ తెలియక మనోవేదనతో ఇటీవలే భర్త నాగేంద్ర మంచం పట్టి మృతి చెందాడు. 

 

దీంతో భారమంతా నాన్నమ్మ రామసుబ్బమ్మ, తాతయ్య (అబ్బ) వెంకట రమణప్పనాయుడులపై పడింది. అయితే ఇటీవలే తాత కూడా అనారోగ్యంతో మంచం పట్టడంతో ఇక కష్టాలన్నీ నానమ్మపైనే పడ్డాయి. ఈ నేపథ్యంలో సోమవారం  రామసుబ్బమ్మతో కలిసి చిన్నారులు వనజ (10), రెడ్డి నాగశంకర్‌నాయుడు (9), శైలజ (6), సునీల్‌కుమార్‌నాయుడు (3)లు సోమవారం ‍కడప కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌ బాబూరావునాయుడును అమ్మ ఆచూకీ తెలపాలని.. అమ్మను చూడాలని ఉందని వేడుకున్నారు.  పోలీసులు, ఇమిగ్రేషన్‌ అధికారులు స్పందిస్తే  ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పలువురు  పేర్కొంటున్నారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top