చిరుత.. చిక్కింది

చిరుత.. చిక్కింది - Sakshi


‘అనంత’లో కలకలం..

* చిరుత దాడిలో ఇద్దరు యువకులకు గాయాలు

* వలవేసి పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు


రాయదుర్గం: జనారణ్యంలోకి వచ్చిన రెండు చిరుతలు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కలకలం సృష్టించాయి. బుధవారం అర్ధరాత్రి అడవిలో నుంచి పట్టణంలోకి వచ్చిన రెండు చిరుతలు స్థానిక ఈ-సేవా సెంటర్ సమీపంలోని ముళ్లపొదల్లో ఉన్న పందులపై దాడి చేసి వాటిని తిని అక్కడే చిక్కుకుపోయాయి. ఉదయం వేళలో ఓ చిరుత వెళ్లిపోగా, మరో చిరుత అక్కడే ఉండిపోయింది. ఉదయం 10 గంటల సమయంలో ఓ యువకుడు బహిర్భూమి కోసం ముళ్లపొదలవైపు వెళ్లడంతో చిరుత కనిపించింది. దీంతో వెంటనే అతను పట్టణంలోకి వెళ్లి మరికొంతమంది యువకులతో కలిసి చిరుత ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు.



ఈ క్రమంలోనే కొందరు యువకులు చిరుతపై రాళ్లు వేయడంతో అది రవినాయక్ అనే యువకుడిపై దాడి చేసింది. అతను స్వల్పంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చెట్టుపైకి ఎక్కిన చిరుత అడ్డుకోబోయిన జాఫర్ అనే యువకుడిని గాయపర్చింది. మరోసారి ప్రయత్నించిన అటవీశాఖ సిబ్బంది స్థానికుల సాయంతో చిరుతను వలలో బంధించారు. చిరుతను తిరుపతి జూకు తరలించనున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీపతి నాయుడు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top