రాజకీయ రక్షణలో మృగాడు!

రాజకీయ రక్షణలో మృగాడు! - Sakshi


లావణ్య హత్య కేసు దర్యాప్తులో అనుచిత జాప్యం

ప్రధాన నిందితుడిని కాపాడేందుకు యత్నాలు

అధికార పార్టీ పెద్దల రాజీ యత్నాలు

బాధిత కుటుంబంపై తీవ్ర ఒత్తిళ్లు  


 

అమ్మవారి సన్నిధిలోనే ఆడకూతుళ్లను వెకిలి చేష్టలతో వేధించిన దుర్మార్గులు వారు.. అక్కడితో ఆగకుండా వారిని కారులో వెంటాడి భయకంపితులను చేశారు. చివరికి కన్నూమిన్నూ కానని కండకావరంతో కారుతో గుద్ది ఒక మహిళను హత్య చేసిన మానవ మృగాలను తక్షణమే చట్టానికి అప్పజెప్పి కఠినంగా శిక్షించాల్సింది పోయి కొందరు అధికార పార్టీ పెద్దలే వారిని రక్షిస్తున్నారన్న సమాచారం తీవ్ర ఆందోళన రేపుతోంది. నిందితులకు ఆశ్రయమివ్వడమే కాకుండా బాధితులు, నిందితుల మధ్య ఏదోవిధంగా రాజీ కుదిర్చి కేసును అటకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ సమాచారం.

 

 

గాజువాక : మహిళను కారుతో గుద్ది అమానుషంగా హ త్య చేసి.. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించడమే దారుణమనుకుంటే.. ఇప్పుడు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడుగా భావిస్తున్న వ్యక్తిని కాపాడటానికి కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మానవీయతకే మచ్చగా మారుతోంది. లంకెలపాలెం సమీపంలోని సాలాపువానిపాలెం వద్ద ఇటీవల జరిగిన హత్య ఘటన జిల్లావాసులను నివ్వెరపరిచింది. అయితే నిందితులపై చర్యలకు పోలీసులు స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిర్భయ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఒత్తిళ్లకు లొంగుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన జరిగి దాదాపు వారం కావస్తున్నా దర్యాప్తు ముందుకు కదలకపోవడం, నిందితుల ఆచూకీపై కనీస సమాచారాన్ని సేకరించకపోవడం చర్చనీయాంశమైంది.



అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దర్శనానికి వెళ్లిన తన వదిన మాటూరి లావణ్య (29) పట్ల, తనపట్ల ఆలయం వద్దే కొంతమంది యువకులు అసభ్యంగాా ప్రవర్తించినట్టు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ బాధితురాలు దివ్య స్పష్టంగా చెప్పింది. అక్కడ నుంచి తప్పించుకొని వస్తున్న తమను ఆ పోకిరీలు కారుతో వెంబడించి మరీ సాలాపువానిపాలెం వద్ద గుద్ది కొంతదూరం ఈడ్చుకెళ్లిపోయారని వివరించింది. ఈ ఘటనలో తన వదిన లావణ్య అక్కడికక్కడే మృతి చెందినట్టు ఆమె తెలిపింది.





 పెద్దల సంరక్షణలో నిందితుడు

 నిందితుని కోసం తాము గాలిస్తున్నా ఆచూకీ తెలియడంలేదని ట్రాఫిక్ పోలీసులు చెప్పడం విస్మయం కలిగిస్తోంది. ఈ హత్యను వారు ఇంకా ట్రాఫిక్ కోణంలోనే చూడటం పట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హేమకుమార్ ఒక మాజీ మంత్రి అనుచరుడని చెబుతున్నారు. ఆయనతో సన్నిహిత సంబంధాలున్న అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు నిందితుడిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఆయనకు మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే సాకుతో వారు ముమ్మరంగా రాజీ ప్రయత్నాలు  చేస్తున్నట్లు పోలీసువర్గాలు సైతం చెబుతున్నాయి. కాగా ప్రధాన నిందితుడు ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే సంరక్షణలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయం పోలీసులకు తెలిసినా పట్టించుకోవడంలేదని బాధితుల బంధువులు అంటున్నారు.





 బాధితులపై ఒత్తిడి

 కాగా హత్య చేసినట్టు బాధితుల నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదు వస్తేనే తాము దర్యాప్తు చేసే వీలుంటుందని ట్రాఫిక్ సీఐ కృష్ణ చెప్పగా.. ట్రాఫిక్ పోలీసుల నుంచి తమకు కేసు బదిలీ అయితే తప్ప ప్రమాదంపై తాము దర్యాప్తు చేపట్టలేమని పరవాడ శాంతిభద్రతల విభాగం పోలీసులు బాధితుల ప్రతినిధులకు చెప్పారు. ఈ విషయంలో పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు వెళ్లకుండా కొంతమంది పెద్దలు బాధితులపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేపట్టాలని పలు ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో మరో ముగ్గురు నింది తుల ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం గమనార్హం. ఫైనాన్షియరైన ప్రధాన నిందితుడు హేమకుమార్ ప్రవర్తనపై అనకాపల్లిలో ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతడిని కఠినంగా శిక్షించాలని, ఈ కేసును తీవ్రంగా పరిగణించాలంటూ అనకాపల్లి ప్రాంతానికి చెందిన పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. హేమకుమార్ వాడిన కారుకు బీమా లేదని, అతడికి లెసైన్స్ కూడా లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అతడిని రక్షించేం దుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top