కుప్పంలో తమ్ముళ్ల తిరుగుబాటు
–అభివృద్ధి లేదంటూ 16 మంది వార్డు సభ్యుల రాజీనామా
కుప్పం : ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు చేశారు. నియోజకవర్గ కేంద్రం, మేజర్గ్రామ పంచాయితీ కుప్పం పట్టణంలో వార్డు సభ్యులుగా ఉన్న 16 మంది పదవులకు రాజీనామాలు చేసి, పత్రాలను స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి చేర్చారు.
మేజర్ గ్రామపంచాయతీ అయిన కుప్పంలో 20 మంది వార్డు సభ్యులతో పాలకవర్గం ఉంది. ప్రస్తుతం 16 మంది వార్డు సభ్యులు మూడేళ్లుగా అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తూ రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. మూడేళ్లుగా కుప్పం పట్టణాభివృద్ధి కోసం విడుదలైన నిధులపై ఎలాంటి లెక్కలూ లేవంటూ ఈ సందర్భంగా ఆరోపించారు. డంపింగ్ యార్డు శుభ్రం చేయడం కోసం రూ.25లక్షలు ఎస్టీఎఫ్ నిధుల ద్వారా రూ.4.5 కోట్లు ఖర్చుపై ఇంత వరకు లెక్కలు చూపిన దాఖాలు లేవని తెలిపారు. దీంతో పాటు పంచాయతీ ఆదాయ వ్యయాలు, ఆస్తుల వివరాలపై ఎలాంటివి వెల్లడించలేదని ఆరోపించారు. రోడ్లు నిర్మాణం, డ్రైనేజీ కాలువ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపిస్తూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మండల పరిషత్ అధికారులు లేకపోవడంతో రాజీనామా పత్రాలను కలెక్టర్కు పంపిస్తున్నట్లు సభ్యులు తెలిపారు.