నిరుద్యోగ యువతకు కుచ్చుటోపీ ?


లబ్బీపేట : మూడు వారాల పాటు శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తామని నమ్మబలికి వందలాదిమంది నిరుద్యోగులను నిలువుదోపిడీ చేస్తున్న ఓ ప్రైవేటు సంస్థ బాగోతం శనివారం బయట పడింది. సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఆకాశవాణి సమీపంలో ఓ హోటల్ పక్క భవనంలో కాల్ సెంటర్ ట్రైనింగ్, కంప్యూటర్ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీషు పేరుతో ఓ ఇన్‌స్టిట్యూట్‌ను నిర్వహిస్తున్నారు.



దీనిలో ఒక్కో నిరుద్యో గి నుంచి తొలుత రూ.3 వేలు వసూలు చేస్తారు. వారికి మూ డు వారాల పాటు శిక్షణ పేరుతో రోజుకు గంట చొ ప్పున ఇన్‌స్టిట్యూట్‌కు రమ్మంటారు. ఆ సమయంలో ఏమీ చెప్పడం లేదంటూ ఇప్పటికే వారి వద్ద డబ్బు కట్టిన బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఇక్కడ వేలాది మంది నిరుద్యోగులు దోపిడీకి గురవుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో సైతం వందలాది మంది నిరుద్యోగుల బయోడెటా ఫారాలు ఉండటం సంస్థ నిర్వాహకులపై అనుమానానికి తావిస్తోంది.



ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడంతో ఎంతోమంది అక్కడ డబ్బు చెల్లించి శిక్షణకు చేరుతున్నారు. వారికి ఎటువంటి శిక్షణ ఇవ్వకపోగా, మూ డు వారాలు దాటినా ఉద్యోగాల విషయమై ఏమీ చెప్పకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నా రు. అదేమని ప్రశ్నిస్తే మళ్లీ రూ.3 వేలు చెల్లించి మరో మూడు వారాలు శిక్షణ పొందాలని చెపుతున్నట్లు  బాధితులు ఆరోపిస్తున్నా రు.



ఇలా ఎంతోమంది  మోసపోతున్నా  ఏమీ చేయలేకపోతున్నట్లు వాపోతున్నారు, ఏదో ఒక చిన్న ఉద్యోగం లభిస్తుందనే ఆశతో చేరితే దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సూర్యారావుపేట పోలీసులు అక్కడకు వచ్చినప్పటికీ బాధితులు వారికి   ఫిర్యాదు చేయలేదు. దీంతో వారు వెనుదిరిగారు.



ఒకచోట అవకాశం లేకుంటే మరోచోటకి పంపిస్తాం



ఇదిలా ఉండగా ఈ వ్యవహారం గురించి  ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకులను ‘సాక్షి’ ఫోన్‌లో వివరణ కోరగా, తమవద్ద నిరుద్యోగులకు ఉద్యోగాలకు కావాల్సిన శిక్షణ ఇస్తామని తెలిపారు. అనంతరం వివిధ సంస్థల్లో ఖాళీల ఆధారంగా ఇంటర్వ్యూలకు పంపుతామన్నారు. ఒకచోట ఎంపిక కాకపోతే మరోచోటుకు పంపుతామన్నారు. అంతేకాని మరేవిధమైన మోసం లేదని తెలిపారు.

 

అంతా బోగస్



ఉద్యోగాలిప్పిస్తామంటూ శిక్షణ పేరుతో వేలాది రూపాయలు దోచుకుంటున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఓ యువతిని తమ సంస్థలోనే ఉద్యోగం చేయమంటున్నారు. ఇదేమి అన్యాయం. అంతా బోగస్. నిరుద్యోగులను దోపిడీ చేస్తున్నారు. ఎటువంటి శిక్షణ ఇవ్వనందున మేము చెల్లించిన సొమ్ము తిరిగి ఇవ్వాలి.

 -మనోజ్, బాధితుడు, ఇబ్రహీంపట్నం

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top