కోదండరామునికి వైభవంగా పవిత్ర సమర్పణ
తిరుపతి కల్చరల్: తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండోరోజైన బుధవారం స్వామికి పవిత్ర సమర్పణ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సేమత శ్రీరాముల వారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రణయం, కుంభారాధాన నిర్వహించారు.
అనంతరం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. విష్వక్సేనులవారికి, ద్వారపాలకులు, భాష్యకార్లు, గరుడాళ్వార్, యాగశాలలోని హోమగుండాలు, బలిపీఠం, ధ్వజస్తంభానికి, ఆలయం ఎదురుగానున్న ఆంజనేయస్వామికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం వైభవంగా జరిగింది.
అనంతరం భాష్యకార్ల గుడి వద్ద శాత్తుమొర చేపట్టారు. రాత్రి 7 నుంచి 9.30 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో హరినాథ్, సూపరింటెండెంట్ మునిసురేష్రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.