కిడ్నాప్..కలకలం


గూడూరు టౌన్ / సైదాపురం: సైదాపురంలో కిడ్నాప్‌నకు గురైన చిన్నారి గూడూరులోని ఓ పాఠశాలలో కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. గూడూరు రూరల్ మండలం నెల్లటూరులో నివాసముంటున్న ఊటుకూరు మహేంద్రరెడ్డి సైదాపురంలో శ్రీలక్ష్మివిద్యానికేతన్ పాఠశాలలను నిర్వహిస్తున్నారు. మంగళవారం మహేంద్రరెడ్డి స్కూల్‌కు భార్య యామినితో పాటు పిల్లలు మోహిత్(3), నిఖిల్(10 నెలలు)లతో కలిసి నెల్లటూరు నుంచి సైదాపురం పాఠశాలకు వెళ్లారు. అనంతరం మహేంద్రరెడ్డి పనులు చూసుకునేందుకు  బయటకు వెళ్లాడు.

 

 ఆ సమయంలో మోహిత్ స్కూల్ లో ఆడుకుంటున్నాడు. అయితే మహేంద్రరెడ్డికి స్నేహితుని ద్వారా రెండు నెలల క్రితం పరిచయమైన గూడూరు వీరారెడ్డిపల్లికి చెందిన వినేష్ మంగళవారం పాఠశాలకు ఎందుకు వెళ్లాడో తెలియదు కానీ అక్కడ ఆడుకుంటున్న మోహిత్‌కు చాక్లెట్ ఆశ చూపి బయటకు తీసుకెళ్లాడు. దీనిని యామిని గుర్తించినప్పటికి వినేష్ భర్త స్నేహితుడు కావడంతో అడ్డుచెప్పలేదు. అయితే మధ్యాహ్నం భోజన సమయం కావడంతో యామిని భర్త మహేంద్రరెడ్డికి ఫోన్ చేసి మోహిత్‌కు ఆకలి వేస్తుంటుంది.. వెంటనే చిన్నారిని తీసుకురావాలని వినేష్‌కు ఫోన్ చేయాలని చెప్పింది.

 

 దీంతో మహేంద్రరెడ్డి వెంటనే వినేష్‌కు ఫోన్ చేయడంతో మోహిత్‌ను నేను అక్కడే వదిలి వెళ్లానని వినేష్ చెప్పాడు. దీంతో చిన్నారి కోసం తల్లి యామిని చుట్టుపక్కల వెతకడమే కాకుండా పాఠశాలలోనూ విచారించారు. మహేంద్రరెడ్డి అక్కడకు చేరుకుని వినేష్‌ను వెంటనే పాఠశాల వద్దకు రావాలని ఫోన్ చేయగా వినేష్ గంటన్నర తర్వాత పాఠశాలకు చేరుకుని పాఠశాలలోనే చిన్నారిని వదిలి వెళ్లినట్లు స్పష్టం చేశాడు.

 

 అనుమానం వచ్చిన మహేంద్రరెడ్డి వెంటనే సైదాపురం పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు వినేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళన పడుతున్న తల్లిదండ్రులకు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చిన్నారి గూడూరులోని ఓ పాఠశాలలో ఉన్నట్లు పోలీసుల ద్వారా సమాచారమందింది. దీంతో వారు ఆత్రుతగా గూడూరుకు చేరుకుని మోహిత్‌ను అక్కున చేర్చుకున్నారు. మహేంద్రరెడ్డి వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రచార ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తుండడంతో అతని కుమారుడు కిడ్నాప్‌కు గురయ్యాడన్న విషయం పట్టణం, రూరల్ ప్రాంతాల్లో దావానలంగా వ్యాపించడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది.

 స్నేహితునిపైనే అనుమానం...

 మహేంద్రరెడ్డికి స్నేహితుడిగా పరిచయమైన వినేష్ అతని నుంచి ఏమి ఆశించాడో తెలియదు కానీ ఆడుకుంటున్న చిన్నారికి చాక్లెట్ ఆశచూపి పాఠశాల నుంచి తీసుకెళ్లాడు. సాయంత్రం చిన్నారి గూడూరులోని వీఎస్‌ఆర్ స్కూల్‌లో కనిపించడం కీలకంగా మారింది. గూడూరులోని వీఎస్‌ఆర్ స్కూల్‌లో బిక్కుబిక్కుమంటూ చిన్నారి కనిపించడంతో స్కూల్‌లో పనిచేస్తున్న టీచర్లతో పాటు యాజమాన్యం ఆ చిన్నారి ఎవరంటూ ఆరా తీశారు.

 

 అయితే మధ్యాహ్నం  విద్యార్థులకు భోజనం పెట్టేందుకు వచ్చిన వారు చిన్నారిని మరిచి వెళ్లి ఉంటారేమోనన్న అనుమానంతో గూడూరు 2వ పట్టణ పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు చిన్నారి ఎవరన్న విషయంపై ఆరాతీశారు. ఈలోగా సైదాపురంలో ఓ చిన్నారి కిడ్నాప్‌కు గురయ్యాడని తెలియడంతో అక్కడి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో మహేంద్రరెడ్డి, యామినిలు బంధువులతో కలిసి 2వ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని బిక్కుబిక్కుమంటూ ఉన్న చిన్నారిని అక్కున చేర్చుకున్నారు.

 

 గూడూరులోని వీఎస్‌ఆర్ పాఠశాలలోని సీసీ కెమెరాల పుటేజీను పోలీసులు పరిశీలిస్తే చిన్నారిని పాఠశాలలో ఎవరు వదిలివెళ్లారన్న విషయం బయటపడే అవకాశం ఉంది. చిన్నారి తల్లిదండ్రులు మాత్రం వినేష్‌పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని క్షేమంగా పోలీసుల ద్వారా తమకు అందజేసిన పాఠశాల నిర్వాహకులు నందిమండలం బాలరాజు, సంజయ్‌లకు మహేంద్రరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి మోహిత్‌కు చాక్లెట్ ఆశ చూపి ఎత్తుకెళ్లాడని అనుమానిస్తున్న వినేష్‌తో పాటు పాఠశాలలో నిర్మాణ పనులు చేస్తున్న మేస్త్రి సురేంద్రను సైదాపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top