మోదీపై అనుచిత వ్యాఖ్యలు సహించం : పల్లె వీణారెడ్డి
హైదరాబాద్ : కాంగ్రెస్ హయాంలో దేశం భ్రష్టు పట్టిపోయిందని, అప్పుడు పేరుకుపోయిన చెత్తనంతా తొలగించి స్వచ్ఛ భారతదేశాన్ని నిర్మించాలనే ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్రమోదీ 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని తీసుకొచ్చారని ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ మహిళా నాయకురాలు పల్లె వీణారెడ్డి అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో స్వచ్ఛమైన పాలన అందించి ఉంటే దేశానికి ఈ దుర్గతి పట్టేది కాదన్నారు.
మోదీని చరిత్ర తెలియని అజ్ఞాని అంటూ మాజీ కేంద్రమంత్రి జైపాల్రెడ్డి పేర్కొనడాన్ని తప్పుబడుతూ.. కాంగ్రెస్ వాదుల అజ్ఞానం మరోసారి బయటపడిందని ఎద్దేవా చేశారు. కుటుంబ పాలనతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దేశాన్ని అధ్వాన్నంగా మార్చారని ఆరోపించారు. మోదీ పాలనను ప్రపంచమంతా హర్షిస్తుంటే.. కాంగ్రెస్ నేతలకు మింగుడుపడటంలేదని దుయ్యబట్టారు. మరోసారి మోదీపై అవాకులు చవాకులు పేలితే బీజేపీ చూస్తూ ఊరుకోదని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ఆమె హెచ్చరించారు.