చంద్రబాబునాయుడు చీటర్
- ఐదు కోట్ల ఆంధ్రులను, మాదిగలను మోసగించాడు
- టీడీపీ, బీజేపీలకు ప్రజలే బుద్ధి చెబుతారు
- మందా కృష్టమాదిగ తీవ్ర విమర్శ
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్కు ఎమ్మార్పీఎస్ మద్దతు
చీరాల: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యే క హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తుంటే అదే కేంద్రానికి వత్తాసు పలుకుతూ 5 కోట్ల ఆంధ్రులను..ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగనవుతానని వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసగించిన చంద్రబాబు ఛీటర్ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ తీవ్ర విమర్శలు చేశారు. గురువారం చీరాల వచ్చిన ఆయన స్థానిక డ్రైనేజీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా ప్రజల ప్రాథమిక హక్కు ప్రత్యేక హోదా అనే నినాదంతో ప్రజాపోరాటం జరగాలన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్కు పట్టిన గతే టీడీపీ, బీజేపీలకు పడుతుందన్నారు.
రాష్ట్ర బంద్కు ఎమ్మార్పీఎస్ మద్దతు...
- ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెల 28న చేస్తున్న రాష్ట్రబంద్కు ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మందాకృష్ణ తెలిపారు.
- భూమాను అరెస్ట్ చేశారు..ఆమంచిని అరెస్ట్ చేయకపోవడం ఏంటి...!
- విజయనగర్కాలనీకి చెందిన టీడీపీ గ్రామ సర్పంచ్ దుడ్డు రూపవతి, ఆమె భర్త మధుబాబులపై చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అతని సోదరుడు ఆమంచి స్వాములు, అనుచరులు బహిరంగంగా దాడి చేసి పోలీసులు కేసు నమోదు చేసి 10 నెలలు కావస్తున్నా ఆమంచిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. అదే నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని ఆఘమేఘాలపై పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ఆమంచిని అరెస్ట్ చేస్తే కాపుల ఓట్లు పార్టీకి దూరమవుతాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. దీనిపై తాము డీజీపీతో పాటుగా, ఎస్టీ, ఎస్సీ కమీషన్ను ఆశ్రయిస్తున్నామన్నారు. సమావేశంలో ఎమ్మార్పీస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, జిల్లా అధ్యక్షుడు ఆలూరి చిరంజీవి మాదిగ, సర్పంచ్ దుడ్డు రూపవతి పాల్గొన్నారు.