రెండో డ్రైవర్ పారిపోయాడా, తప్పించారా?


నందిగామ: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నాయకుడు కె. పార్థసారధి డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతల బస్సు కాబట్టే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తోందన్నారు.



చనిపోయిన వారిని ఆదుకోవాలన్న కనీస ఆలోచన లేని దౌర్బగ్య ప్రభుత్వం ఇదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రన్న బీమాతో చేతులు దులుపుకుంటారా అని ప్రశ్నించారు. చంద్రన్న బీమా ఉన్నవారికి ఒకలా, లేనివారికి మరోలా పరిహారం ప్రకటించడడం సమంజసం కాదన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వేరే రాష్ట్రాల వారికి తక్కువ పరిహారం ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు.





నందిగామ ప్రభుత్వాసుపత్రి నుంచి హడావుడిగా మృతదేహాలను ఎందుకు తరలిస్తున్నారని నిలదీశారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న రెండో డ్రైవర్ పారిపోయాడని చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. రెండో డ్రైవర్ పారిపోయాడా, తప్పించారా అని సూటిగా ప్రశ్నించారు. రెండో డ్రైవర్ ను కనీసం ప్రశ్నించరా అని అడిగారు. ఎవరినో కాపాడడానికే ఇదంతా చేస్తున్నారని పార్థసారధి ఆరోపించారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top