బాల్యానికి సంకెళ్లు

బాల్యానికి సంకెళ్లు - Sakshi


బాల్యానికి సంకెళ్లు వేశారు వేటపాలెం పోలీసులు... దొంగతనం ఆరోపణతో ఒక బాలుడికి సంకెళ్లు వేసి మూడు రోజులుగా పోలీసు స్టేషన్‌లోనే బంధించడం వివాదాస్పదంగా మారింది. పోలీసుల నిర్వాకంపై మీడియాలో కథనాలు రావడంతో జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ స్పందించారు. చీరాల డీఎస్‌పీని విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.ఒక మనిషికి సంకెళ్లు వేయడం అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 చెబుతోంది.



అక్రమ నిర్బంధం కూడా నేరమే. పైగా 18 సంవత్సరాలు నిండని బాలురను అదుపులోకి తీసుకునే  సమయంలో సంరక్షకునికి తెలియచేయాలి. ఆ బాలుడిని రెస్క్యూహోంకి పంపాల్సి ఉంటుంది. ఇవన్నీ పోలీసులకు తెలియనిది కాదు. అయితే మనం ఏం చేసినా చెల్లుతుందనే భావనతో ఒక బాలుడిని మూడు రోజులుగా స్టేషన్‌లో బంధించి ఉంచడం వేటపాలెం పోలీసులకే చెల్లింది.  పైగా పారిపోతాడనే భయంతో కాళ్లకు సంకెళ్లు వేసి గొలుసుతో స్టేషన్‌లోని కిటికీకి బంధించడం వంటి చర్యలతో వేటపాలెం పోలీసులు చట్టాన్ని అపహాస్యం చేశారు.

 

వివరాల్లోకి వెళ్తే...

 సాక్షి ప్రతినిధి, ఒంగోలు, వేటపాలెం చీరాల రూరల్ మండలం రామకృష్ణాపురం పంచాయతీ బండకాలనీకి  చెందిన పది - పదకొండేళ్ల  బాలుడిని మూడురోజుల క్రితం వేటపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుని తల్లిదండ్రులు శ్రీను, వెంకటేశ్వరమ్మతోపాటు ఆనందరావు కూడా వీధుల వెంట కాగితాలు ఏరుకొని వాటిని విక్రయించి జీవనం సాగిస్తుంటారు. అయితే  వేటపాలెం ఇందిరాకాలనీలో జరిగిన దొంగతనం కేసులో బాలుని హస్తం ఉందన్న అనుమానంతో వేటపాలెం పోలీసులు ఆ బాలుడిని మూడు రోజులుగా పోలీస్ స్టేషన్‌లో ఉంచి విచారిస్తున్నట్లు సమాచారం.



బాలుడిని మూడు రోజులుగా స్టేషన్‌లో కాళ్లకు సంకెళ్లు వేసి ఉన్న విషయం మీడియాకు పొక్కడంతో  వెంటనే స్పందించిన పోలీసులు బాలుడిని సోమవారం అరస్టు చేసినట్లు దొంగతనం అంగీకరించినట్లు హడావిడిగా కేసు నమోదు చేశారు. ఎస్సై చంద్రశేఖర్‌ను వివరణ కోరగా సోమవారం మధ్యాహ్నం బాలుడు వేటపాలెం రైల్వే స్టేషన్‌లో పోలీస్‌లను చూసి పారిపోతుండగా అనుమానంతో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. బాలుడు వేటపాలెం ఇందిరాకాలనీలో జరిగిన దొంగతనంలో అనుమానితుడిగా గుర్తించి విచారిస్తున్నట్లు తెలిపారు.



ఈ చర్యల పట్ల ప్రజాసంఘాలు, మానవహక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని బాలుడికి సంకెళ్లు వేయడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.  ఈ ఘటన ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కాగానే జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ స్పందించారు. చీరాల డీఎస్పీ జయరామారావుని విచారణకు ఆదేశిచారు. విచారణ నివేదిక రాగానే పోలీసుల తప్పు ఉందని తేలితే చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

 

బాలుని నిర్బంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి మూడు రోజులుగా పోలీస్ స్టేషన్‌లో కాళ్లకు సంకెళ్లు వేసి మైనర్ బాలుడిని ఉంచడం చట్ట ప్రకారం నేరమని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. బాలుడికి సంకెళ్లు వేసి ఉంచిన వారిపై చర్చలు తీసుకోవాలన్నారు.

- ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్

 

కంచె చేనుమేసినట్లుంది

చట్లాలను కాపాడాల్సిన పోలీసులే చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం నాయకుడు కొండయ్య అన్నారు. చట్టం ప్రకారం నేరం చేసిన వారిని అదుపులోకి తీసుకున్న తరువాత 24 గంటల్లో నేరం చేసిన వ్యక్తి కోర్డులో హాజరు పర్చాల్సి ఉంది. కానీ బాలుడి కాళ్లకు సంకెళ్లు వేసి మూడు రోజులుగా చట్టాలు తెలిసిన పోలీస్‌లే అతిక్రమిచడం నేరమన్నారు.

- సీపీఎం నాయకుడు కొండయ్య

 

ఇది మానవహక్కుల ఉల్లంఘనే

ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే.  సంకెళ్లు వేయడం ఆర్టికల్ 21కి విరుద్దం. అక్రమ నిర్బంధం కూడా నేరమే. బాలుని  రెస్క్యూహోంకి తరలించకుండా స్టేషన్‌లో సంకెళ్లు వేసిన పోలీసులపై చర్య తీసుకోవాలి.

- పిట్టల లక్ష్యయ్య, న్యాయవాది

 

బాలల హక్కులకు భంగమే

ఇది కచ్చితంగా బాలల హక్కులను ఉల్లంఘించడమే.  బాలలపై నేరారోపణ, దొంగ అనే పదాలే వాడకూడదు.  సూర్యాస్తమయంలోపే ఇంటికి పంపించాల్సి ఉంటుంది. అలా కాకుండా  స్టేషన్‌లో ఉంచడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. దీన్ని బాల సంక్షేమ కమిటీ ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్తాం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరతాం.

- సాగర్, చైల్డ్‌లైన్ ప్రతినిధి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top