ఏపీలో సమ్మెబాట పట్టిన జూనియర్ డాక్టర్లు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. సాధారణ సేవలు నిలిపేస్తూ జూడాలు ఆందోళనకు దిగారు. ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాలన్న నిబంధనపై నిరసనగా వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శనివారం ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లు 48 గంటల్లో ప్రభుత్వం స్పందించకపోతే అత్యవసర సేవలు సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు.
కాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్తో నిన్న జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో ఒక సంవత్సరం పాటు వైద్య సేవలందించాలనే నిబంధనను తొలగించాలని పట్టుపట్టారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తాము వ్యవహరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. దాంతో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తూ విధులను బహిష్కరించారు. మరోవైపు తెలంగాణలోనూ జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మె విరమించాలని హైకోర్టు సూచించినా వారు తమ పట్టు వీడలేదు.