వైద్య సేవల్లో ఏపీ భేష్: నడ్డా
అమరావతి: వైద్య సేవల విషయంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న సేవలను అభినందిస్తున్నానని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి నడ్డా అన్నారు. అమరావతి పరిధిలోని తాడికొండలో రూ. 4 కోట్లతో నిర్మించిన రూరల్ హెల్త్ సెంటర్ను, విద్యార్థుల అదనపు వసతి గృహాలను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నడ్డా మాట్లాడుతూ హెల్త్ సెంటర్ను, విద్యార్థుల వసతి గృహాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఎయిమ్స్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని వెల్లడించారు. వచ్చే ఏడాది ఎయిమ్స్ తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఫాతిమా మెడికల్ కాలేజి వివాదంపై కేంద్ర మంత్రికి మరోసారి వివరించామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు చెప్పారు.
కోర్టు నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటామని, ఈ కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం తరపున కచ్చితంగా న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కోర్టు వారికి ఎక్కడ అవకాశం కల్పించమని చెప్తే అక్కడ చదువుకునే అవకాశం ఇస్తామన్నారు. అలాగే గేట్లో ఏపీ విద్యార్థులకు సంబంధించి ఆర్టికల్ 371-డిలో ఉన్న ఇబ్బందులపై ముఖ్యమంత్రి కూడా నడ్డాకు వివరించారన్నారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.