చిత్రం.. కార్డుల విచిత్రం


 సాలూరు: అర్హులందరికీ రేషన్‌కార్డులు మంజూరుచేస్తున్నామని పాలకులు గొప్పగా చెబుతున్నా... క్షేత్ర స్థాయిలో చాలా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. జన్మభూమి కమిటీ సిఫారసు చేసిన విధానం చూస్తే నోళ్లు వెళ్లబెట్టాల్సి వస్తోంది. రెండో విడత జన్మభూమి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న పేదలకు తెల్లరేషన్‌కార్డులు, అవసరమైనవారికి గులాబీకార్డులు ఇటీవల జరిగిన మూడో విడత జన్మభూమి కార్యక్రమం లో పంపిణీ చేయాలని భావించారు. అయితే వచ్చిన దరఖాస్తులు ఎక్కువగా ఉండట ం, పూర్తిస్థాయిలో మంజూరుకాకపోవడంతో గొడవలు వస్తాయని అధికారులు గుర్తించి పంపిణీ తాత్కాలికంగా నిలిపేశారు. జిల్లాలో రేషన్‌కార్డులకోసం దాదాపు 68వేల దరఖాస్తులు రాగా, వీరిలో ప్రాధమికంగా 60వేల మందిని అర్హులుగా గుర్తిం చారు. జన్మభూమికమిటీల జోక్యంతో వాటి సంఖ్య 38వేలకు దిగింది. ఇంతవరకు బాగానే వున్నా, మంజూరైనవారి జాబితాను చూస్తే విస్మ యం గొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి.

 

 ఒకకార్డు వుండగానే ఇంకోటి : బార్యా, భర్త, పిల్లలతో వుంటున్నా, రేషన్‌కార్డుల్లేక అనేక ప్రభుత్వ పథకాలకు అర్హత పొందలేకపోతున్నారు. వారు కార్డులకోసం దరఖాస్తు చేసుకుంటే వారికి ఇవ్వకుండా ఇప్పటికే కార్డు వున్నవారికి మరోమారు రేషన్‌కార్డులను మంజూరు చేసేశారు. ఇలాంటివారు వందల సంఖ్యలోనే వున్నారు. అలాగే అర్హతున్నా మంజూరుకానివారు వేలల్లోనే మిగిలారు. వున్నవారికే మరలా మంజూరుకావడంతో అర్హులు గగ్గోలు పెడుతున్నారు. తాము ఏమిచేస్తే న్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. రిటైర్డు ఉద్యోగులు, ఆర్థికంగా స్థితిమంతులు గులాబీకార్డు మంజూరుచేయాలని దరఖాస్తు చేసుకుంటే ఏకంగా తెల్లరేషన్‌కార్డులను మంజూరుచేసేశారు. కొందరు వాటిని తీసేసుకోగా, ఇంకొందరు తిరస్కరిస్తుండడం గమనార్హం.

 

 అడ్రస్ లేని లబ్ధిదారులు : మంజూరైన కార్డులను పంపిణీ చేసేందుకు రెవెన్యూ సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయా కార్డుల్లోని వారు తామిచ్చిన అడ్రస్‌లో లేకపోవడంతో ఏం చేయాలో తెలీక తెలీడం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి కార్డులు సాలూరు పట్టణంలోనే 250వరకు వున్నాయంటే మంజూరు ఎలా జరిగిందో ఊహించవచ్చు. జిల్లాలో 4వేల 800వరకు వున్నట్టు అధికారులు లెక్కలు తేలుస్తున్నారు.  

 

 లబ్ధిదారులు లభ్యం కావడంలేదు

 కొత్తగా మంజూరైన తెల్లకార్డులను ఇద్దామంటే కొంతమంది లబ్ధిదారులు దొరకడంలేదు. వారికి కేటాయించిన డిపోల పరిధిలోను, వారిచ్చిన అడ్రస్‌లోనూ గుర్తించలేకపోతున్నాం. ఇబ్బంది పడుతున్నాం. కొద్దిరోజులు వేచిచూసి తిరిగి ఉన్నతాధికారులకు అప్పగించేస్తాం.

 - పి రాజు, పి శ్రీను, వీఆర్వోలు, సాలూరు



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top