6న విశాఖలో ‘జై ఆంధ్రప్రదేశ్’ సభ

6న విశాఖలో ‘జై ఆంధ్రప్రదేశ్’ సభ - Sakshi


పాల్గొననున్న జగన్... పోస్టర్ విడుదల

- రాష్ట్రవ్యాప్తంగా ఐదుచోట్ల సభలు

- ప్రత్యేక హోదా సాధనే లక్ష్యం

 

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను ప్రజాపక్షంగా వ్యతిరేకించడంతో పాటుగా, హోదా సాధనలో ప్రజలను చైతన్యపరిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నవంబర్ 6వ తేదీన విశాఖపట్టణంలో ‘జై ఆంధ్రప్రదేశ్’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని పార్టీ సీనియర్ నేతలు ఈ సభలో పాల్గొంటున్నారు. దీన్ని పురస్కరించుకుని రూపొం దించిన ‘జై ఆంధ్రప్రదేశ్’ పోస్టర్‌ను హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, ఏపీ శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పక్షం నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సంయుక్తంగా ఆవిష్కరించారు. విశాఖపట్నంలోని ఇందిరాప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం (వెలమపేట)లో 6వ తేదీ సాయంత్రం మూడు గంటలకు జరిగే ఈ సభలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఆవశ్యకతపై జగన్ మాట్లాడతారని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఐదు చోట్ల ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభలు నిర్వహిస్తామని, విశాఖలో తొలి సభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సభకు పెద్ద సంఖ్యలో జనం హాజరు కావాలని పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు.



 హోదా సాధనలో  వైఫల్యం: ఉమ్మారెడ్డి

 ప్రత్యేక హోదా సాధించడంతో చంద్రబాబు ప్రభుత్వం  విఫలమైందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికలపుడు ఇచ్చిన హామీల అమలు చేయలేకపోవడం, ప్రత్యేక హోదాను సాధించలేక పోవడం వంటి వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా చంద్రబాబు మాత్రం ఎన్నికల్లో చేసిన వాగ్దానాలకన్నా ఎక్కువే చేశామని ప్రగల్భాలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా అంశంపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తొలినుంచీ అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు.



ధర్నాలు, దీక్షలు చేయడంతో పాటు విద్యార్థులు, యువకులను చైతన్యపరిచేందుకు ఓ వైపు ‘యువ భే రి’లు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రత్యేకహోదా సాధనకు ప్రజలను చైతన్యపరిచేందుకే ఇప్పుడు ‘జై ఆంధ్రప్రదేశ్’ సభలు కూడా నిర్వహిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 15 ఏళ్లపాటు ప్రత్యేక హోదా కావాలని తొలుత డిమాండ్ చేసిన చంద్రబాబు ఇపుడు హోదా అవసరం లేదని చెప్పడానికి గల నేపథ్యం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ నేతలు మోపిదేవి వెంకటరమణ, ఎస్.దుర్గా ప్రసాదరాజు, వాసిరెడ్డి పద్మ, ఎం.అరుణ్‌కుమార్, చల్లా మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. ‘ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కు....’, ‘జై ఆంధ్రప్రదేశ్... జైజై ఆంధ్రప్రదేశ్’ అంటూ నేతలు నినాదాలు చేశారు.

 

 నేడు కర్నూలులో ‘యువభేరి’

 కర్నూలు (ఓల్డ్‌సిటీ): ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న యువభేరి కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యారుు. కర్నూలు శివారు గుత్తి జాతీయ రహదారిలోని వీజేఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ ప్రత్యేక హోదాపై యువతలో చైతన్యం తీసుకురావడంతో పాటు వారితో ముఖాముఖి నిర్వహిస్తారు. సుమారు 10వేల మంది సామర్థ్యం కలిగిన కన్వెన్షన్ హాలులో ఇందుకోసం ప్రత్యేక వేదిక ఇప్పటికే రూపుదిద్దుకుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top