26న కాకినాడలో జగన్ పర్యటన
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, కాకినాడ: కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 26న కాకినాడలో పర్యటించనున్నారు. ఈ నెల 23 నుంచి రెండ్రోజులపాటు జగన్ కాకినాడలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ వినాయకచవితి నేపథ్యంలో షెడ్యూల్లో మార్పు చేశారు. ఈ విషయాన్ని పార్టీకి చెందిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల కోర్ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మంగళవారం మీడియాకు వెల్లడించారు.
వినాయక చవితిని ఘనంగా నిర్వహించడానికి కాకినాడ ప్రజలు ఏర్పాట్లు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో వారికెలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికే జగన్ పర్యటనలో మార్పు చేసినట్లు తెలిపారు. తాజా షెడ్యూల్ ప్రకారం.. 26వ తేదీ ఉదయం వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి కాకినాడ వస్తారని, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల సాధక బాధకాలు తెలుసుకునేందుకు ఆ రోజు నగరంలో పర్యటిస్తారని ఆయన వివరించారు. 27వ తేదీన వైఎస్ జగన్ తిరిగి హైదరాబాద్కు బయల్దేరి వెళతారని తెలిపారు.