పేదల ఆరోగ్యం గురించి పట్టదా?

పేదల ఆరోగ్యం గురించి పట్టదా?


ప్రొద్దుటూరు క్రైం: ‘జిల్లాలోనే పెద్దాస్పత్రి. అయినా 14 ఏళ్లుగా డాక్టర్లు లేరు. సిబ్బంది కొరత. దీనికి కారణం ప్రభుత్వాల అసమర్థతే. రోగుల ఆరోగ్యం గురించి పట్టించుకునే దిక్కులేదు. ఇలాగైతే ఎలా? అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా స్థాయి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి రాచమల్లుతో పాటు జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, కమలాపురం, మైదుకూరు ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి హాజరయ్యారు. ‘ఇక్కడి ఆస్పత్రిని నమ్ముకుని వచ్చే రోగి.. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా పూర్తి స్థాయిలో కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లేలా చూడాలి.



అందుకు ఎంత డబ్బు కావాలో చెప్పండంటూ ఆయన వైద్యాధికారులను అడిగారు. ఆస్తులు అమ్మై సరే డబ్బు ఇస్తానని ప్రకటించారు. బ్లడ్‌బ్యాంక్‌కు 30 కేవీ జనరేటర్‌ను తన సొంత ఖర్చులతో సమకూరుస్తానని హామీ ఇచ్చారు. విద్యుత్ కోతల నేపథ్యంలో జనరేటర్ ఏర్పాటు చాలా ఖర్చుతో కూడుకున్నదని, సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని జెడ్పీ చైర్మన్ గూడూరు రవి సూచించారు. తొమ్మిది మంది సివిల్ సర్జన్లకు గాను కేవలం నలుగురు ఉండటం ఏమిటని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆస్పత్రి సూపరింటెండెంట్ మూర్తిని ప్రశ్నించారు.  పేదలకు వైద్యం అందేలా చూడాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి  సూచించారు.  డీసీహెచ్‌ఎస్ రామ్మోహన్‌రావు, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, రాజుపాళెం జెడ్పీటీసీ సభ్యురాలు మంజుల, చెన్నూరు ఎంపీపీ బాలమ్మ, రోటరీ క్లబ్ అధ్యక్షుడు రాజారామ్మోహన్‌రెడ్డి, ఆర్‌ఎంఓ బుసిరెడ్డి, డిప్యూటీ ఆర్‌ఎంఓ శివరాం, నర్సింగ్ సూపరింటెండెంట్ రాణెమ్మ, వైద్యులు పాల్గొన్నారు.



 సూపరింటెండెంట్‌తో బ్లడ్‌బ్యాంక్ డాక్టర్ వాగ్వాదం

 బ్లడ్‌బ్యాంక్ డాక్టర్ విజయనిర్మల, సూపరింటెండెంట్ ఎస్‌ఎన్.మూర్తి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బ్లడ్‌బ్యాంక్‌కు సంబంధించి ఎలాంటి నిధులు ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.  







 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top