ఇది పెట్టుబడుల బాట

ఇది పెట్టుబడుల బాట


 సీఎం జపాన్ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన

నేటి నుంచి 29వ తేదీ వరకు జపాన్‌లో చంద్రబాబు బృందం పర్యటన

వివిధ సంస్థల సీఈవోలతో భేటీ

 ‘సన్‌రైజ్ స్టేట్ ఆఫ్ ఏపీ’ పేరుతో పవర్   పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న సీఎం

10 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్  ఉందని చెప్పబోతున్న ముఖ్యమంత్రి

     అది ప్రభుత్వ భూమా?      ప్రైవేటు భూమా? వెల్లడించని వైనం

     పెట్టుబడులకున్న అవకాశాలపై   లఘు చిత్రాన్ని రూపొందించిన సర్కారు

 

 సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూ సమీకరణను రైతులు ఒకపక్క వ్యతిరేకిస్తున్నా.. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది.. పెట్టుబడులు పెట్టండంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోపక్క విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారు. ఆ విధంగా పెట్టుబడులు పెట్టేవారికి భూ కేటాయింపుతో పాటు అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని, మౌలికసదుపాయాలు ఏర్పాటు చేస్తామని జపాన్‌కు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఆయన ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక  వేత్తల బృందంతో జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలో పెట్టుబడులకున్న సానుకూలాంశాలను అక్కడి ప్రభుత్వానికి, వివిధ కంపెనీలు, వాణిజ్య సంస్థల ప్రతినిధులకు వివరిస్తారని రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. జపాన్ పెట్టుబడి దారులకు వివరించేందుకు ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కూడా రూపొందించారు. అందులో పేర్కొన్న  పది లక్షల ఎకరాలూ ప్రభుత్వ భూమా? లేక ప్రైవేటు భూమా? అనేది ఎక్కడా స్పష్టం చేయకపోవడం గమనార్హం. ‘సన్‌రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పేరిట రూపొందించిన ఈ ప్రజెంటేషన్‌లో   రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న అన్ని ప్రత్యేకాంశాలను పొందుపరిచారు.


దేశంలో ఆంధ్రప్రదేశ్.. తూర్పు, ఆగ్నేయ దేశాలైన జపాన్, చైనా, థాయ్‌లాండ్, మలేసియా, సింగపూర్, శ్రీలంకలకు వ్యూహాత్మక ప్రాంతంగా ఉందని, పారిశ్రామిక, వ్యాపారానుకూల వాతావరణం రాష్ట్రంలో ఉందని అందులో వివరించారు. ‘దేశంలో మొట్టమొదటి తీరప్రాంత పారిశ్రామిక కారిడార్‌గా విశాఖపట్నం-చెన్నై రూపొందుతోంది. ఇది గేట్ వే టూ ఈస్ట్‌గా మారుతుంది. కొల్‌కతా నుంచి చెన్నై వరకు ఉన్న కారిడార్లో ఏపీ లోని తొమ్మిది జిల్లాల్లో ఉన్న తీరప్రాంతమే కీలకం..’ అని  పేర్కొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో పాటు ఈ మేరకు ఒక లఘు చిత్రాన్ని కూడా రూపొందించి బాబు బృందం జపాన్‌కు తీసుకువెళ్లారు.


పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లోని వివరాలు..

  10 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్

 ‘రాష్ట్రంలో పారదర్శకమైన భూకేటాయింపు విధానం అమలుచేస్తున్నాం. 10 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకు ఉంది. (ప్రభుత్వ భూమా, ప్రైవేటు భూమా ?అన్నది వివరించలేదు.) ఈ భూముల ధరలూ అందుబాటులో ఉన్నాయి. అమ్మకానికి లేదా దీర్ఘకాలిక లీజుకు వీలుగా కేటాయింపు విధానం ఉంటుంది. పెట్టుబడులు పెట్టేవారు కొనే భూములకు స్టాంప్ డ్యూటీ పూర్తిగా వెనక్కి తిరిగి చెల్లిస్తాం. అందుబాటులో ఉన్న భూమి వివరాలను ఏపీ గవర్నమెంట్ పోర్టల్లో చూసుకోవచ్చు..’ అని పేర్కొన్నారు. విశాఖలో 20 వేల ఎకరాలు, కాకినాడలో 10 వేలు, మచిలీపట్నంలో 5 వేలు, దొనకొండలో 40 వేలు, ఓర్వకల్లులో 32 వేలు, నాయుడుపేటలో 2,500, కష్ణపట్నం సెజ్‌లో 2 వేలు, హిందూపూర్లో 10 వేలు, కడపలో 20 వేలు, చిత్తూరులోని శ్రీసిటీ సెజ్‌లో వెయ్యి ఎకరాల భూమి ఉందని తెలిపారు. (ఇవన్నీ కలిపితే 1.37 లక్షల ఎకరాలు మాత్రమే కాగా మిగతా భూమి ఎక్కడుంది? ప్రభుత్వానిదా? ప్రైవేటుదా? అనే వివరాలు లేవు)  ‘ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నాం. ప్రైవేటు పారిశ్రామికపార్కులు, టౌన్‌షిప్పుల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తాం. పెట్టుబడులను ప్రోత్సహించేలా అనేక రాయితీలతో కూడిన పారిశ్రామిక, పోర్టుల విధానం ఉంటుంది.


మౌలిక సదుపాయాలు, రాయితీల కల్పనతో ఐటీ విధానం ఉంటుంది. ఈఎస్‌డీఎం ఎకో సిస్టమ్‌తో ఎలక్ట్రానిక్ పాలసీ ద్వారా ఆయా పరిశ్రమల అభివద్ధికి మార్గాలు వేస్తాం. ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తాం. 14 స్మార్ట్ సిటీలు, 3 మెగాసిటీలు, టూరిజమ్ సర్క్యూట్, 2 ఎల్‌ఎన్‌జీ సర్క్యూట్‌లు, 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 8 డొమెస్టిక్ విమానాశ్రయాలు, 3 మెట్రో రైలు ప్రాజెక్టులు, కొత్త పోర్టులు, సౌర, పవన విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు వీలుగా ప్రణాళికలు ఉన్నాయి. మచిలీపట్నంలో పెట్రో కెమికల్ ప్రాజెక్టు, ఏర్పేడు, కందుకూరు, దొనకొండ, నాయుడుపేట, కర్నూలుల్లో పారిశ్రామిక టౌన్‌షిప్పులు, విశాఖపట్నం, కాకినాడ, హిందూపూర్లలో ఎలక్ట్రానిక్ క్లస్టర్లు, గుంటూరు, అనంతపురం, కర్నూలుల్లో ఇంటిగ్రేటెడ్ టైక్స్‌టైల్ పార్కులు, అన్ని జిల్లా కేంద్రాల్లో మెగా ఫుడ్ పార్కులు, విశాఖపట్నంలో ఐటీ హబ్, మధ్య కోస్తా జిల్లాల్లో మెరైన్ హబ్, చిత్తూరు, నెల్లూరులతో ఆటో హబ్ ఏర్పాటు చేస్తాం. లోహ పరిశ్రమలు, ఉద్యాన పంటలు, రక్షణ, ఏరోస్పేస్‌లకు ఆలవాలంగా రాయలసీమ ప్రాంతాలు ఉండనుంది..’ అని వివరించారు.




 2022 నాటికి దేశంలో మూడో స్థానం

 ‘2022 నాటికి ఏపీని దేశంలోనే మూడో స్థానానికి, 2029 నాటికి అన్నిటికన్నా అగ్రస్థానంలోకి తీసుకువెళ్లనున్నాం. ఇందుకోసం ప్రాథమిక, పట్టణ, పారిశ్రామిక, మౌలిక సదుపాయాలు, సేవలు, నైపుణ్యాల అభివృద్ధి, సామాజిక సాధికారత మిషన్లను, నీరు, గ్యాస్, రోడ్, పవర్, ఫైబర్ గ్రిడ్లను ఏర్పాటుచేశాం. బడి పిలుస్తోంది, నీరు..చెట్టు, పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తోంది, పరిశుభ్రత-ఆరోగ్యం అనే ప్రచారోద్యమాలు చేపట్టాం.  దేశంలోని సగానికి పైగా నౌకా ఎగుమతులు ఏపీనుంచే సాగుతున్నాయి. బెరైటీస్, మైకా, సున్నపురాయి నిక్షేపాలకు నిలయం. 2,950 సంస్థల ద్వారా 3.45 లక్షల మంది నైపుణ్యంకల యువకులు, విద్యార్థులు అందుబాటులో ఉన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, గనులు, ఫార్మా, ఆటోమొబైల్, ఇంజనీరింగ్ రంగాల్లో అత్యధిక అభివృద్ధికి అవకాశాలున్నాయి.


పర్యాటక పరిశ్రమది రాష్ట్ర ఆదాయంలో కీలకపాత్ర. విశాఖపట్నం, గంగవరం, కష్ణపట్నం డీప్ సీ పోర్టులు, రానున్న ఐదేళ్లలో 17 వేల మెగావాట్ల ఉత్పత్తి ద్వారా జరగనున్న 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా నదులతో  పుష్కలంగా ఉన్న నీటివనరులు, 1.20 లక్షల కిలోమీటర్ల విస్తారమైన రోడ్లు రాష్ట్రాభివృద్ధికి మూలకాలు. దేశంలోనే అభివృద్ది చెందుతున్న విశాఖపట్నం నగరం మొట్టమొదటి స్మార్ట్‌సిటీగా రూపొందబోతోంది. అత్యుత్తమ విద్యాసంస్థలు, వైద్యసంస్థలు, పర్యాటక ప్రాంతాలుండడంతోపాటు కొత్తగా మెట్రోరైళ్ల వ్యవస్థ ఏర్పాటుకాబోతోంది..’’ అని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో పేర్కొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top