నేడే పీఎస్‌ఎల్‌వీ సీ38 ప్రయోగం

నేడే పీఎస్‌ఎల్‌వీ సీ38 ప్రయోగం


మొత్తం 31 ఉపగ్రహాలను నింగికి పంపనున్న ఇస్రో

ఇందులో 14 దేశాలకు చెందిన 29 ఉపగ్రహాలు

మనదేశానికి చెందినవి రెండు



శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి నేడు శ్రీకారం చుట్టింది. నేటి ఉదయం 9.29 గంటలకు సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ38 ద్వారా మొత్తం 31 ఉపగ్రహాలను ప్రయో గించనుంది. ఇందులో రెండు మనదేశానికి చెందినవి. వీటిలో 712 కిలోల బరువు కలిగిన కార్టోశాట్‌–2ఈ ఉపగ్రహంతోపా టు దేశీయ యూనివర్సిటీకి చెంది న ఒక చిన్న ఉపగ్రహం ఉంది. ఇవికాకుండా 14 దేశాలకు చెందిన 29 ఉపగ్రహాలను నింగిలో పం పేందుకు సర్వం సిద్ధం చేశారు.



 గురువారం సాయంత్రం ఇస్రో చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ షార్‌ చేరుకుని కౌంట్‌డౌన్‌ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రాకెట్‌కు తుదివిడత తనిఖీలు నిర్వహించారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 40వ ప్రయోగం కాగా, ఎక్సెల్‌ స్ట్రాపాన్‌ బూస్టర్ల ప్రయోగంలో 17వ ప్రయోగం కావ డం విశేషం. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం పీఎస్‌ఎల్‌వీ సీ38 నమూ నా రాకెట్‌ను శ్రీవారి పాదాలచెంత ఉంచి ఇస్రో డైరెక్టర్, యశోద శాస్త్రవేత్తలు కృష్ణమూర్తి, జయరామన్, ఎస్‌కే కనుంగో, సేతురామన్‌ పూజలు నిర్వహించారు.



దేశీయ అవసరాల కోసమే కార్టోశాట్‌–2

దేశీయ అవసరాల కోసం ఇస్రో కార్టోశాట్‌ సిరీస్‌ ప్రయోగాలను వరుసగా నిర్వహిస్తోంది. భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్‌ ఉపగ్రహాల సిరీస్‌ను 2005లోనే రూపొందించారు. 2007 జనవరి 10న పీఎస్‌ఎల్‌వీ సీ7 ద్వారా కార్టోశాట్‌–2, 2008 ఏప్రిల్‌ 28న పీఎస్‌ఎల్‌వీ సీ9 ద్వారా కార్టోశాట్‌–2ఏ, 2010 జూలై 12న పీఎస్‌ఎల్‌వీ సీ15 ద్వారా కార్టోశాట్‌–2బీ, 2016 జూన్‌ 22న పీఎస్‌ఎల్‌వీ సీ34 ద్వారా కార్టోశాట్‌–2సీ, 2016 ఫిబ్రవరి 15 కార్టోశాట్‌–2డీతో ఇప్పటికే 5 ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. మరింత సమాచారం పొందడానికి నేడు పీఎస్‌ఎల్‌వీ సీ38 ద్వారా కార్టోశాట్‌–2ఈ ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉపగ్రహ వ్యవస్థ సూర్యానువర్తన «ధృవ కక్ష్యలో వివిధ దశల్లో పరిభ్రమిస్తూ భౌగోళికపరమైన సమాచారాన్ని అందిస్తోంది.



 దీనిలో అమర్చిన ఫ్రాంక్రోమాటిక్‌ మల్టీస్పెక్ట్రల్‌ కెమెరా భూమిని పరిశోధిస్తూ అత్యంత నాణ్యమైన ఛాయాచిత్రాలను అందిస్తుంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, సముద్ర తీరప్రాంతాల నిర్వహణ, రహదారుల పర్యవేక్షణ, నీటి పంపిణీ, భూవినియో గంపై మ్యాప్‌ల తయారు, విపత్తులను విస్తృతంగా అంచనా వేసే పరిజ్ఞానం, వ్యవసాయ సమాచారం అందుబాటులోకి వస్తుంది. భూమ్మీది మార్పులను ఎప్పటికప్పుడు ఛాయాచిత్రాలు తీసి పంపుతుంది. సుమారు రూ.350 కోట్లు వ్యయం చేసినట్టు సమాచారం. ఈ ఉపగ్రహం ఐదేళ్లపాటు సేవలు అందిస్తుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top