ఈసారీ.. ఫలించని బుట్టా ప్రయత్నం

ఈసారీ.. ఫలించని బుట్టా ప్రయత్నం - Sakshi


మంత్రాలయం-కర్నూలు కొత్త రైలు మార్గం ఏర్పాటు కోసం  కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తను గెల్చినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. అయినా నిధుల జాడ లేక ఆ ప్రాజెక్టు మూలనపడింది. ఈ విషయాన్ని ఆమె శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనూ స్పష్టం చేశారు.  

 

ఏటేటా పెరిపోతున్న అంచనాలు

గతంలో రూపొందించిన రూ.165 కోట్లు అంచనా విలువ 2011 నాటికి రూ.900 కోట్లకు చేరింది. తాజాగా ఇప్పుడు నిర్మాణ వ్యయం కిలో మీటరుకు రూ.10 కోట్లు చొప్పున 110 కిలో మీటర్లుకు రూ.1100 కోట్లకు పైగా చేరుతుందని అంచనా. అయితే రైల్వే శాఖ నిబంధల ప్రకారం ఆ శాఖ మంజూరు చేసే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది.



ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా అందుకు సిద్ధపడితేనే పార్లమెంటులో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌కు ముందు ప్రతిపాదనలు పంపుతారని సమాచారం. జిల్లాపైన టీడీపీ ప్రభుత్వం ఆది నుంచి వివక్ష ధోరణి ప్రదర్శిస్తోందన్న విషయం మరోసారి రుజువైంది. ఏళ్ల తరబడి ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సుముఖత చూపకపోవడంతో మళ్లీ నిరాశే మిగిలింది.

 

 

కర్నూలు రాజ్‌విహార్:

ఒకటి కాదు.. రెండు కాదు.. నలభై మూడేళ్ల నిరీక్షణ... ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆధ్యాత్రిక కేంద్రమైన మంత్రాలయం నుంచి కర్నూలు వరకు నిర్మించాల్సిన రైల్వే కొత్త మార్గానికి దిక్కులేదు. ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పైన పేర్కొన్న రైలు మార్గం ప్రస్తావనే లేదు.



కొత్త రైలు ప్రాజెక్టుల జాబితాలో దీనికి స్థానం కల్పించకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం పైన పేర్కొన్న రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన తన వాటా ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా రెండు సార్లు సర్వే కోసం కేటాయించిన నిధులు వృధా అయ్యాయి. భూ సేకరణ, పనుల ప్రారంభానికి నిధులు మంజూరు కాకపోడంతో సర్వేతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

 

ఎప్పటి నుంచో కోరుతున్నా...

మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు, కోడుమూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని పల్లెలు, కర్నూలు  మీదుగా శ్రీశైలం వరకు రైల్వే మార్గం నిర్మించాలన్నది దశాబ్దాల ప్రతిపాదన. 1970లో కర్నూలు ఎంపీ, ఎమ్మిగనూరు ప్రాంతనేత వై.గాదిలింగన్న గౌడ్ మంత్రాలయం నుంచి కర్నూలు మీదుగా శ్రీశైలం వరకు రైలు మార్గం ఏర్పాటు చేయాలన్న అంశాన్ని పార్లమెంటులో చర్చించారు.  



అప్పటి నుంచి ఇది కలగానే మిగిలింది. చివరకు 2004లో రాఘవేంద్రస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం, వాణిజ్య, వ్యాపార రంగాల అభివృద్ధికి ఈ లైను నిర్మించాలని ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.165 కోట్లతో రైల్వే లైను నిర్మించేందుకు అంగీకరించారు. సర్వే పనుల కోసం రూ.9.43 లక్షలు కేటాయించారు. సర్వే పూర్తి చేసి నివేదికలు సైతం అందజేశారు. అంతటితో ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి.

 

2010లో మళ్లీ ఒత్తిడి తెచ్చినా...


ఎన్నికల అస్త్రంగా మారిన మంత్రాలయం రైల్వేలైన్ ఏర్పాటును కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ, అప్పటి రైల్వే సహాయ మంత్రి మునియప్ప ద్వారా 2010లో మళ్లీ తెరపైకి తెచ్చారు. దీంతో 2010 ఫిబ్రవరి 24న అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ బడ్జెట్‌లో రైల్వే లైను ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు సంబంధించి బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించారు. అయితే వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం, పెరిగిన నిర్మాణ, భూ కొనుగోలు వ్యయం దృష్ట్యా రీసర్వే చేయాలని నిర్ణయించారు.



2011 ఫిబ్రవరి 23న రైల్వే పనుల సర్వేకు రూ.6 కోట్లతో టెండర్లు పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన రైల్వే కాంట్రాక్టరు ఒకరు టెండర్ దక్కించుకుని సర్వే చేసి 2011 డిసెంబర్‌లో సర్వే నివేదికలు సమర్పించారు. గతంలో రూపొందించిన మార్గంలోనే రైలు మార్గం నిర్మించుకోవచ్చని, మంత్రాలయం సమీపంలోని కొండాపురం వద్ద రైల్వే స్టేషను నిర్మించాలని సూచించారు. రైలు మార్గం ఏర్పాటయ్యే ప్రాంతాల్లోనే రైతుల పొలాల్లో హద్దులు కూడా నిర్ధరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top