కేసీఆర్ ముఖ్యమంత్రా.. ఉద్యమకారుడా?

కేసీఆర్ ముఖ్యమంత్రా.. ఉద్యమకారుడా? - Sakshi


హైదరాబాద్: ప్రభుత్వానికి, అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) ఖాతాలను తెలంగాణ ప్రభుత్వం స్తంభింపజేసిందని విద్యాశాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఈ అంశంపై న్యాయస్థానాన్నిఆశ్రయించి తెలంగాణా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో పాటు బ్యాంకు వ్యవహార శైలిపై అక్కడే తేల్చుకుంటామని గంటా పేర్కొన్నారు. తమ శాఖ నిర్వహిస్తున్న ఖాతాను ఫ్రీజ్ చేసిన ఎస్‌బీహెచ్‌పై పరువు నష్టం దావా కూడా వేస్తామన్నారు. శుక్రవారం సచివాలయంలో సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డితో కలిసి మంత్రి గంటా మీడియాతో మాట్లాడారు.


 


'ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపికట్టెది' మరోదారి అన్నట్లు తెలంగాణా సర్కారు వ్యవహరిస్తోందన్నారు. ఫాస్ట్’ పథకం అమలుపై  తెలంగాణా సర్కారుకు కోర్టు తీర్పు చెంప పెట్టులా మారినా వారి వైఖరిలో మార్పు రాకపోవడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ సీఎంలా కాకుండా ఉద్యమకారుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణా అంటే ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారని మంత్రి గంటా దుయ్యబట్టారు. ఎంసెట్ పరీక్ష నిర్వహణపై ఫిబ్రవరి 2న జరిగే మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. యోగా క్లాసులకు తాము హాజరు కాలేకపోయామని, ప్రత్యేకంగా యోగా గురువు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమాన్ని సందర్శించనున్నట్లు మంత్రి గంటా వివరించారు.  మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి ఛాంబర్‌లో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top