ఎర్ర లింకు.. పచ్చ జంకు!


- అంతర్జాతీయ స్మగ్లర్ రమణ పట్టుబడడంతో టీడీపీ నేతల్లో వణుకు

- రూ. 9 కోట్ల విలువైన ఎర్ర చందనం స్వాధీనం

- నల్లమలలో విస్తృతంగా కూంబింగ్

సాక్షి, కడప/అర్బన్ :
జిల్లాలోని ఒంటమిట్ట ప్రాంతానికి చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ బొడ్డె వెంకట రమణ పోలీసులకు పట్టుబడడంతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఈ స్మగ్లర్ వెంట కొందరు టీడీపీ నేతలు తిరుగుతూ సన్నిహిత సంబంధాలు నెరిపారన్న కోణంపై కూడా పోలీసులు విచారణ ముమ్మరం చేయడంతో ఏం జరుగుతుందోననే భయం మొదలైంది. స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకుంటే ఎవరినైనా, ఎంతటివారినైనా వదలబోమని పోలీసు యంత్రాంగం గట్టిగా హెచ్చరిస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. వెంకట రమణకు బినామీలుగా చలామణి అవుతూ తిరుగుతున్న కొంతమంది ఇప్పటికే భయంతో రహస్య ప్రదేశాలకు ఠ మొదటిపేజీ తరువాయి



వెళ్లినట్లు తెలుస్తోంది. సోమవారం పోలీసులు భారీ మొత్తంలో ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఇంత పెద్ద మొత్తంలో ఎర్రచందనం పట్టుబడటం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. సుమారు 4 టన్నుల 570 కిలోల ‘ఏ’ గ్రేడ్ రకం ఎర్రచందనం దొరకడం జిల్లాలో సంచలనంగా మారింది. స్మగ్లర్ బొడ్డె వెంకట రమణతోపాటు మేస్త్రి బొడ్డే శ్రీనివాసులు ఒంటిమిట్ట మండలంలోని పట్రపల్లెకు చెందిన వారు కాగా, చంద్రానాయక్, శ్రీనునాయక్, నాతుకూరి రమణ, అబ్బయ్యగారి సోమయ్యలు కూడా ఒంటిమిట్ట మండలం వారే. కాగా, అంతర్జాతీయ స్మగ్లర్ బొడ్డె వెంకట రమణతో సంబంధాలు కలిగి ఉన్న మరో ఇద్దరు అంతర్జాతీయ స్మగ్లర్లు బెంగళూరులోని ఫయాజ్, మరో స్మగ్లర్ శివశంకర్‌లను పట్టుకునేందుకు పోలీసులు వ్యూహం రచిస్తున్నారు.



భక్తుల ముసుగులో ఎర్ర కూలీలు

వైఎస్సార్ జిల్లా నుంచి బస్సులు, రైళ్లలో నిఘా పెంచడంతో కూలీలు ఇక్కడి నుంచి వెళ్లడం దాదాపు తగ్గిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే, తాజాగా బొడ్డె వెంకట రమణ కేసులో కీలక అంశాలు బయటపడినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ స్పష్టం చేస్తున్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు ప్రాంతం నుంచి తిరుపతికి భక్తుల ముసుగులో ఎర్ర కూలీలు వస్తున్నారని, ఎవరు కూలీలో, ఎవరు భక్తులో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. దానిని నిర్ధారించుకోవడం కొంత కష్టమవుతోందన్నారు. గొడ్డళ్లు, ఇతర సామగ్రిని అడవిలోనే వదిలి సామాన్య భక్తుల వలె రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిసిందన్నారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారని, అడవిలో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు.  



ఎనిమిదేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న బొడ్డే

అంతర్జాతీయ స్మగ్లర్ బొడ్డె వెంకట రమణ ఎనిమిదేళ్ల క్రితం నేర కార్యకలాపాలకు అలవాటుపడ్డాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు దొరక్కకుండా తప్పించుకుని తిరుగుతూ ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తున్నాడు. గతంలో ఆర్‌ఎస్‌ఐ శివారెడ్డిపైన దాడి చేసిన కేసులో నిందితుడు. ఇతనిపై 14 కేసులు నమోదయ్యాయి. ఇందులో 11 అటవీ శాఖకు చెందినవి కాగా, మరో మూడు పోలీసు శాఖకు చెందినవి. 2009, 2014లో పోలీసులకు దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు. వేర్వేరు ప్రాంతాల్లోని బడా స్మగ్లర్లతో సంబంధాలు నెరుపుతూ భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నాడు. కూలీలకు కేజీ ఎర్రచందనానికి రూ. 150, మేస్త్రికి రూ.200 చొప్పున చెల్లిస్తూ అక్రమ రవాణాకు బరితెగించాడు. ఈ సంఘటనలో నిందితులను అరెస్టు చేయడంలో, ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకోవడంలో క ృషి చేసిన ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ బుక్కాపురం శ్రీనివాసులు, ఎస్‌బీ డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, సీఐలు ఉలసయ్య, రాజేంద్రప్రసాద్, బీవీ శివారెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top