పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్టుల్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం


మర్రిపాలెం (విశాఖపట్నం): పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్టుల్లో ఇంటర్న్‌షిప్‌కు అభ్యర్థులను ఆహ్వానిస్తున్నట్టు విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి చెప్పారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నేతృత్వంలో ‘పాస్‌పోర్ట్ సేవామిత్ర’గా ఇంటర్న్‌షిప్‌కు కేంద్రం అవకాశం కల్పిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 81 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, 37 ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయా ల్లో ఈ-గవర్నెన్స్ ద్వారా ఇంటర్న్‌షిప్ జరుగుతుందన్నారు. జూన్ 8న ప్రారంభమయ్యే ఇంటర్న్‌షిప్ 4-8 వారాలు కొనసాగుతుందన్నారు.  డిగ్రీ చేసినవారు www.passportindia.gov.in లో పొందుపరిచిన ఫారంలో వివరాలు నమోదు చేసి, ఈ నెల 31లోగా ‘ది డెరైక్టర్(పిఎస్‌పి), సి.పి.వి. డివిజన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్స్ అఫైర్స్, న్యూఢిల్లీ’ చిరునామాకు పంపాలని తెలిపారు.

 

ఉద్యోగులు, విద్యార్థులకు మినహాయింపు

పాస్‌పోర్ట్ మంజూరులో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో ఉద్యోగులు, విద్యార్థులకు మినహాయింపు ఇస్తున్నట్టు చెప్పారు. ఉద్యోగులు ఎన్‌వోసీకి దరఖాస్తు చేసినట్టు ఫారం అనెక్సర్ ఎన్, ఎం, బి, నకలు సమర్పిస్తే దరఖాస్తు స్వీకరిస్తామన్నారు. 1989 జనవరి 26 తర్వాత పుట్టిన వారికి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చినట్టు తెలిపారు. పుట్టిన తేదీ సర్టిఫికెట్, పది లేదా తత్సమాన విద్యార్హత సర్టిఫికెట్, ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ జారీచేసిన ధ్రువీకరణ పత్రం లేదా కోర్టు ద్వారా జారీ అయిన ధ్రువపత్రం.. వీటిలో ఏ ఒక్కటున్నా మినహాయింపు వర్తిస్తుందన్నారు. ఏపీలో తొలిసారిగా ఓ హిజ్రాకు పాస్‌పోర్ట్ ఇచ్చినట్లు చౌదరి చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top