దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు
- పది రోజులపాటు పది అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం
- ప్రత్యేక కుంకుమార్చన, చండీహోమం, ఆర్జిత సేవలు
సాక్షి, విజయవాడ/విజయవాడ పశ్చిమ: పది రోజులపాటు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. అమ్మవారు పది అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తొలి రోజు గురువారం స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తారు. లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరానున్నారు. మహోత్సవాల్లో భాగంగా దేవస్థానం ప్రత్యేక కుంకుమార్చన, శత చండీయాగాలు నిర్వహిస్తోంది. భక్తులు ఆర్జిత సేవా టికెట్లు తీసుకుని కుంకుమార్చన, చండీ హోమంలో పాల్గొనవచ్చు.
27న పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
తొలిరోజు స్నపనాభిషేకం అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. రెండో రోజు నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. 27వ తేదీ మూలానక్షత్రం రోజున మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 11 వరకూ అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశముంది. మూలానక్షత్రం రోజున సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పిస్తారు. భక్తుల రద్దీని దృష్ట్యా కెనాల్ రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు ఏర్పాటుచేశారు. వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటుచేశారు.
భక్తుల కోసం ఏర్పాట్లు..
ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ వెయ్యి బస్సులు నడుపుతోంది. ఐదు వేల మంది పోలీసులను నియమించారు. ఇతర ఆలయాల నుంచి 300 మంది దేవాదాయ సిబ్బందిని, 1000 మంది ఎన్సీసీ, ఎన్.ఎస్.ఎస్ వలంటీర్లను కేటాయించారు. భక్తులకోసం టోల్ ఫ్రీ నం: 18004259099ను ఏర్పాటుచేశారు.
నగరోత్సవం, తెప్పోత్సవం
దసరా మహోత్సవాల్లో అమ్మవారి నగరోత్సవం కనులపండువగా నిర్వహిస్తారు. రోజూ సాయంత్రం 4 గంటలకు శివాలయం నుంచి నగరోత్సవం ప్రారంభమై అర్జునవీధి, రథం సెంటర్, వినాయక గుడి మీదగా రథం సెంటర్ టోల్ గేటు ద్వారా ఇంద్రకీలాద్రి పైకి చేరుకుంటుంది. నగరోత్సవంలో బ్రహ్మరథం, బేతాళనృత్యం, తాళభజనలు, సంకీర్తనలు, కోలాట బృందాలు, నృత్య బృందాలు, వేద విద్యార్థులు, కేరళ వాయిద్యం, సన్నాయి వాయిద్యం, ఘటాటోపం కార్యక్రమాలు నిర్వహిస్తారు. 30వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు కృష్ణానదిలో హంసవాహనంపై అమ్మవారు, స్వామివార్ల నదీ విహార తెప్పోత్సవం కనుల పండువగా సాగుతుంది.
ఇంద్రకీలాద్రిపై మహాగణపతి విగ్రహ ప్రతిష్ట
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయానికి నైరుతి భాగంలో 9 అడుగుల మహా గణపతి విగ్రహాన్ని బుధవారం ప్రతిష్టించారు. వెలగపూడికి చెందిన డాక్టర్ మోహన్రామకృష్ణ ఈ విగ్రహాన్ని తయారుచేయించి ఆలయానికి విరాళంగా అందించారు. తిరుపతికి సమీపంలోని ఎస్పీఎల్ఎన్ కల్చర్స్కు చెందిన శిల్పశాలలో సుమారు 40 రోజుల పాటు 20 మంది శిల్పులు రేయింబవళ్లూ ఈ విగ్రహాన్ని తయారుచేశారు. దసరా ఉత్సవాల నాటికి విగ్రహాన్ని ప్రతిష్టించాలనే సంకల్పంతో అతి తక్కువ సమయంలోనే తయారుచేసినట్లు ప్రధాన శిల్పి పెంచల ప్రసాద్ చెప్పారు. విగ్రహానికి ఆలయ ఈవో సూర్యకుమారి, అర్చకులు శంకర శాండిల్య పూజలు నిర్వహించారు.