విధి విలాపం
రణస్థలం: వారిది నిరుపేద కుటుం బం..ఇప్పటికీ చిన్న పూరిగుడిసె వారి ఆవాసం..తల్లిదండ్రులు కూలిపనులు చేసి, పిల్లలను చదివించారు. పెద్దవాడు..ఇండియన్ ఎయిర్ఫోర్స్కు ఎం పిక కావడంతో..వారికి కొంత సాం త్వన చేకూరింది. రెండేళ్ల క్రితం ఉద్యోగం చేరిన కుమారుడు..నెలావారీ పంపుతున్న కాస్తో..కూస్తో..సొమ్ముతో కాలం వెళ్లదిస్తూ..చిన్న కుమారుడిని చదివిస్తున్నారు. వారి సంతోషాన్ని చూసి విధికి కన్నుకుట్టింది. వి మాన ప్రమాద రూపంలో పెద్ద కుమారుడిని పొట్టన పెట్టుకుంది. విషయం తెలిసి..గుండెలు బాదుకుని విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
రణస్థలం మండలం గోసాం గ్రామానికి చెందిన దుంప రమణయ్య, అసిరితల్లిలది నిరుపేద కుటుంబం. ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. రెక్కాడితే గాని డొక్కాడని వీరు..అష్టకష్టాలు పడి కుమారులను చదివించారు. కుమార్తెలకు కష్టపడి పెళ్లిళ్లు చేశారు. ఇప్పటికీ చిన్న పూరి గుడిసెలోనే ఉంటున్నారు. పరిస్థితి దయనీయంగా మారుతున్న తరుణంలో పెద్దకుమారుడు లక్ష్మునాయుడికి 2012లో ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఉద్యోగం వచ్చింది. దీంతో ఆ కుటుంబంలో ఆనందకాంతులు వె ళ్లి విరిశాయి. మెల్లగా కుటుంబ ఆర్థిక పరి స్థితి కుదుట పడుతూ వచ్చింది.
ఉన్న పూరి గుడిసెను తీసేసి..పక్కా ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు.ఇంతలోనే పిడుగు లాంటి వార్త వారిని కలిచి వేసిం ది. ఎయిర్ఫోర్స్లో పనిచేస్తున్న లక్ష్మునాయుడు..శుక్రవారం ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానం ఏఎల్హెచ్ ధ్రువ్ ఉత్తరప్రదేశ్లో కూలిపోయిన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడంటూ..సమాచారం అందడంతో..హతాశులయ్యారు. గుండెలు బాదుకుని విలపిస్తున్నారు. గోసాం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదే ప్ర మాదంలో ఇద్దరు పెలైట్లతో పాటు..ఐదుగురు వైమానిక దళ సైనికులు చనిపోయిన విషయం విదితమే.
ఇటీవలే సెలవుపై వచ్చి..
యూపీలో ఉన్న లక్ష్మునాయుడు ఇటీవలే సెలవుపై వచ్చి కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎంతో సరదాగా గడిపి వెళ్లాడు. వెళ్లి..15 రోజుల్లోనే ఘోరం జరిగిపోయిందంటూ..తల్లిదండ్రులు విలపిస్తున్నారు. లక్ష్మునాయుడి స్నేహితుడు ముగిది రమణ ఫోన్ చేసి..ఈవార్తను చెప్పడంతో అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. పెళ్లి చేద్దామనుకుంటే..ఇలా అందని లోకాలకు వెళ్లిపోయావా..అయ్యా అంటూ..తల్లిదండ్రులు, అక్క లు రోదిస్తున్న తీరు స్థానికులను సైతం కంటతడి పెట్టించింది.
నేడు గోసాంకి మృతదేహం..
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మునాయుడి మృతదేహం ఆదివారం ఉదయం గోసాంకు రానుంది. ఇక్కడే అంత్యక్రియలు జరుగనున్నాయి.