సుర్రుమంటున్న సూరీడు


జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

అధిక ఉష్ణోగ్రతలు నమోదు

మోగుతున్న మృత్యుఘంటికలు




విజయనగరం గంటస్తంభం/ఫోర్టు: భానుడు భగ్గుమంటున్నాడు. జిల్లా ప్రజలపై నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. సాహసించి ప్రయాణించేవారిని మృత్యు ఒడికి చేర్చుతున్నాడు. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరగడంతో ఉదయం 8 గంటలేతై చాలు ఇంటి నుంచి బయటకు వచ్చేం దుకు జనం భయపడుతున్నారు. జిల్లాలో గతేడాది మార్చిలో అత్యధికంగా 33.8 డీగ్రీలు ఉష్టోగ్రత నమోదైతే... ఏప్రిల్‌లో 35.2 డిగ్రీలు... మేలో అత్యధికంగా 38.4 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది.



తర్వాత క్రమేపీ ఎండలు తగ్గుముఖం పట్టాయి. ఈఏడాది మార్చిలో అత్యధికంగా 34 డీగ్రీలు ఉష్టోగ్రత నమోదుకాగా ఏప్రిల్‌ నెలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఏప్రిల్‌ 22న  40 డిగ్రీలు అత్యధిక ఉష్టోగ్రత నమోదుకాగా 23న 41 డీగ్రీలు నమోదైంది. 24 నుంచి 27వ తేదీ వరకు మళ్లీ 40 డిగ్రీలు ఉష్టోగత్ర నమోదైంది. ఆ తర్వాత మేఘాలు మూలంగా ఎండలు కాస్తా తగ్గాయి.



గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు

వేసవిలో ఎండలు సహజం. అలాగని పనులు మానుకుని ఇంటి వద్ద కూర్చుని ఉండలేని పరిస్థితి. సాహసించి ఎండలో ప్రయాణిస్తే ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. గతేడాది వేసవిలో జిల్లాలో ఏకంగా 155 మంది వడదెబ్బకు గురై మృతిచెందగా 115 మంది మృతిచెందినట్టు అధికారులతో కూడిన త్రిసభ్యకమిటీ లెక్కతేల్చింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో మార్చి నుంచి వడదెబ్బ కారణంగా 8 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఆరుగురు మృతిని త్రిసభ్య కమటీ ధ్రువీకరించింది. వాస్తవంగా చూస్తే జిల్లాలో ఇప్పటివరకు 30 మందికిపైగా మృతి చెందారు. మృతుల కుటుంబాలకు అవగాహన లేకపోవడం, త్రిసభ్య కమిటీ అభ్యంతరాలు నేపథ్యంలో వేపాడ, విజయనగరం, దత్తిరాజేరు తదితర మండలాల్లో కొన్నింటిని అధికారులు తిరస్కరిస్తున్నారు. వీరంతా ఎండ తీవ్రత తట్టుకోలేక మృతి చెందిన వారే.



ఉపశమన చర్యలు  నామమాత్రం

ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్నా ఉపశమన చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. చలివేంద్రాలు ఏర్పాటు అర్భాటంగా మారింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. ఏర్పాటు చేసినా నీరు తప్ప మజ్జిగ పంపిణీ చేయడంలేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం దీనికి కారణం. మార్చి నెల చివర్లో రూ.65 లక్షలు బడ్జెట్‌ రిలీజ్‌ చేసినా ఖజానాపై ఆంక్షలతో ఆ నిధులు వెనుక్కి పోయాయి. కలెక్టర్‌ ఖాతా నుంచి నిధులు వినియోగించాలని నిర్ణయించినా ఫలితం లేదు. ముందుగా ఖర్చు చేసి యూసీలు ఇస్తే ఆనిధులు విడుదల చేసే అవకాశం ఉండడంతో చలివేంద్రాలు ఏర్పాటు నామమాత్రంగా మారింది. జనాలకు దాహం మిగులుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top