పంచాయతీల్లో ఆదాయం పెంచండి
ఒంగోలు టూటౌన్: జిల్లాలో అన్ని పంచాయతీల ఆదాయం పెంపునకు కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కె.శ్రీదేవి సూచించారు. ఒంగోలు డివిజన్ పంచాయతీ అధికారులతో 100 రోజుల యాక్షన్ ప్లాన్పై శుక్రవారం స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశం హాలులో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో మంచినీటి ఓవర్హెడ్ ట్యాంకులను 15 రోజులకోసారి శుభ్రం చేసి నివేదికలు పంపాలని ఆదేశించారు. సైడ్ కాల్వల పూడిక తీతలో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు.
గ్రామాల్లో వీధిలైట్లు నూరుశాతం వెలిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పంచాయతీలకు సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్లు, చేపల చెరువులు, ఖాళీ స్థలాల లీజుల బకాయిలను వెంటనే వసూలు చేయాలని ఆదేశించారు. వేలం పాటల సమయంలో పంచాయతీలకు ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చె ప్పారు. పంచాయతీ అనుమతి లేకుండా వేసిన వెంచర్లకు అధికారిక అనుమతులు తీసుకునేలా సంబంధిత యజమానులను ప్రోత్సహించాలన్నారు.
అనుమతులు లేకుండా నిర్మించే అపార్ట్మెంట్లను ప్రారంభంలోనే అడ్డుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న కోర్టు కేసులపై సమాధానం పంపే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని పంచాయతీలను నాలుగు కేడర్లుగా విభజించామని, వాటి ఆధారంగానే త్వరలో కార్యదర్శులను బదిలీ చేస్తామని డీపీఓ శ్రీదేవి వివరించారు. సమావేశంలో డీఎల్పీవో, ఒంగోలు డివిజన్లోని 20 మండలాల ఈవోఆర్డీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.