‘ఎన్నికల’ హామీ ‘నీటి’మూటేనా?
⇒ 2010 నుంచి జరగని నీటి సంఘాల ఎన్నికలు
⇒ అధికారానికి రాగానే జరిపిస్తామన్న చంద్రబాబు
⇒ అందుకు సుముఖంగా లేని అధికార పార్టీ ఎమ్మెల్యేలు
⇒ సమస్యలను పట్టించుకునే వారే లేరని రైతుల నిట్టూర్పు
అమలాపురం : చంద్రబాబు మాటలకు.. చేతలకు పొంతన ఉండదు అనడానికి నీటి సంఘాల ఎన్నికలు జరగకపోవడమే ఒక ఉదాహరణ. అధికారం చేపట్టిన కొత్తలో నీటి సంఘాలను బలోపేతం చేసేందుకు తక్షణం ఎన్నికలు నిర్వహిస్తానని బాబు ఇచ్చిన హామీ నెలలు గడుస్తున్నా నెరవేరకుండా పోయింది. గడువు దాటుతున్నా ప్రభుత్వం నుంచి ఎన్నికల నిర్వహణకు ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో ఈసారి కూడా నీటి సంఘాలకు ఎన్నికలు జరిగే అవకాశం లేదని రైతులు నిట్టూరుస్తున్నారు. జిల్లాలో గోదావరి డెల్టాలతోపాటు ఏలేరు, తాండవ, పంపా ప్రాజెక్టుల పరిధిలో, మైనర్ ఇరిగేషన్ ఆధ్వర్యంలో ఉన్న చెరువుల పరిధిలో నీటి సంఘాలున్నాయి. గోదావరి తూర్పు, మధ్య డెల్టా ల పరిధిలో 145 నీటి సంఘాలు, ఏలేరు పరిధిలో 25, మిగిలినవాటి పరిధిలో మరో 16, మైనర్ ఇరిగేషన్ పరిధిలో 217 సంఘాలున్నాయి. మేజర్ ప్రాజెక్టు పరిధిలోని నీటి సంఘాలకు 12 మంది, మైనర్ ప్రాజెక్టుల పరిధిలో నీటి సంఘాలకు ఆరుగురు చొప్పున ప్రాదేశిక సభ్యులను
రైతులు ఎన్నుకుంటారు. జిల్లా మొత్తం మీద 3,534 మంది వరకు ప్రాదేశిక సభ్యులుంటారని అంచనా. ఆయా సభ్యులు నీటి సంఘాల చైర్మన్లను ఎన్నుకుంటారు. చైర్మన్లలో ఒకరిని డిస్ట్రిబ్యూటరీ కమిటీ(డీసీ)లకు చైర్మన్గా, వారిలో ఒకరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా ఎంపికవుతారు. శాసనమండలి, రాజ్యసభ తరహాలో ప్రతి రెండేళ్లకూ ఒకసారి మేజర్ ప్రాజెక్టుల పరిధిలో నలుగురు, మైనర్ ప్రాజెక్టు పరిధిలో ఒక ప్రాదేశిక సభ్యునికి ఎన్నిక జరగాల్సి ఉంది. ఇలా మన జిల్లాలో 2008లో ఎన్నికలు జరిగాయి. తర్వాత 2010లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఓటమి భయంతో అప్పటి రోశయ్య, కిరణ్కుమార్రెడ్డిల ప్రభుత్వాలు ఎన్నికలను వాయిదా వేసుకుంటూ వచ్చాయి.
ఇలా 2012 వరకు ఎన్నికలు లేకుండా గడిచిపోయాయి. అప్పటివరకు మనుగడలో ఉన్న నీటి సంఘాలకు పదవీకాలం పెంచుకుంటూ వచ్చింది. అయితే 2012 డిసెంబరు నాటికి మొత్తం సభ్యులు ఖాళీ కావడంతో వారి స్థానంలో ఇరిగేషన్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందే తప్ప ఎన్నికలు మాత్రం నిర్వహించలేదు. దీనితో రెండేళ్లుగా నీటి సంఘాల మనుగడ లేకుండా పోయింది. గత ఏడాది వరుసగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో నీటి సంఘాలకు కూడా ఎన్నికలు జరుగుతాయని ఆశించినా ఫలితం లేకుండా పోయింది.
రాష్ట్ర విభజన, కొత్త ప్రభుత్వం ఏర్పాటులతో నీటి సంఘాల ఎన్నికల ఆశలు రేకెత్తాయి. దీనికి తోడు నీటి సంఘాలను తెచ్చిన ఘనత తనదేనని, కాంగ్రెస్ ఈ వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలో చంద్రబాబు చెప్పుకొచ్చారు. నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న సమయంలో ఈ సంఘాలను బలోపేతం చేసేందుకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. సాధారణంగా నీటి సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ డిసెంబరు మొదటివారంలో విడుదల కావడం, జనవరిలో ఎన్నికలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. గడువు దాటినా ఇప్పటివరకూ నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఎన్నికలు ఎప్పుడైనా జరిపే అవకాశమున్నా ఇప్పటివరకు ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టే సూచనలు కూడా కనిపించడం లేదు.
ప్రస్తుతం అధికార పార్టీ శాసనసభ్యుల తీరు చూస్తుంటే తమకు పోటీగా మరో అధికార కేంద్రం ఏర్పడేందుకు వారు సుముఖంగా లేక పోవడంతో ప్రభుత్వం నీటి సంఘాల ఎన్నికలను చాపచుట్టేసిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే నీటి సంఘాల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. ఒకవైపు రబీలో తరచూ నీటి ఎద్దడి ఏర్పడుతుండడం, మురుగునీటి కాలువలు పూడుకుపోవడం వల్ల ఖరీఫ్ భారీ వర్షాలకు పంట నష్టపోవడానికి నీటి సంఘాలు మనుగడలో లేకపోవడం కూడా ఒక కారణమని రైతులు విమర్శిస్తున్నారు. తాము ఎన్నుకునే నీటి సంఘాలు ఏలుబడిలో ఉంటే బాధ్యతాయుతంగా పనిచేస్తాయని రైతులు భావిస్తున్నారు.