'విశాఖ ఎంపీగా రేపే నామినేషన్ వేస్తా'
బీజేపీతో తమ పార్టీ పొత్తుపై టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం విశాఖపట్నంలో పెదవి విప్పారు. బీజేపీతో టీడీపీ కలసి ఎన్నికలల్లో పోటి చేయడం తనకు ఎంత మాత్రం ఇష్టం లేదన్నారు. అదే విషయాన్ని తనతోపాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు అధినేత చంద్రబాబు వద్ద చెవినిల్లు కట్టుకుని పోరామని... ఆయన మాత్రం తమ మాటలను పెడ చెవిన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బీజేపీతో పొత్తు నిర్ణయాన్ని చంద్రబాబు విరమించుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందా లేదా అనేది నేడు ఖరారు అవుతుందన్నారు. ఓ వేళ బీజేపీతో పొత్తులో భాగంగా విశాఖపట్నం ఎంపీ స్థానాన్ని ఆ పార్టీకి కేటాయించిన తాను మాత్రం టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం ఖాయమని గంటా మరి బల్లగుద్ది చెప్పారు. శనివారం విశాఖ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తానని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.