'ఆపండి అనే లోపే పెళ్లి అయిపోయింది..!

'ఆపండి అనే లోపే పెళ్లి అయిపోయింది..!


ఏలూరు: చాలా సినిమాల్లో సరిగ్గా తాళి కట్టే సమయంలో.. సీన్  చాలా స్లో మోషన్ గా ఉంటుంది. థియేటర్ సీట్లలో కూర్చున్నవారంతా కాస్తంత ఆసక్తిగా సీట్లలోంచి కొంచెం లేస్తున్నట్లుగా మెడలు ముందుకుసాచి పెట్టి చూస్తుంటారు.. ఒక సస్పెన్స్ మ్యూజిక్ వినిపిస్తుంటుంది. సరిగ్గా వరుడు తాళి కట్టే సమయానికి.. ఆగండి అని ఒక డైలాగ్ వినిపిస్తుంది. దీంతో అయ్యో అంటూ ఊసురుమంటాం. సరిగ్గా అలాంటి డైలాగే వినిపించింది. కానీ, కాస్తంతా ఆలస్యంగా రావడంతో ఇక్కడ మాత్రం పెళ్లి జరిగిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో శుక్రవారం రాజమండ్రికి చెందిన సురేంద్ర మోహన్ అనే వ్యక్తి భార్యకు తెలియకుండా మరో పెళ్లి సిద్ధమయ్యాడు.



ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య ఉమా మహేశ్వరి కళ్యాణ మండపం వచ్చేసరికి మరో అమ్మాయి మెడలో తాళి కట్టేశాడు.  ఆగ్రహానికి గురైన ఆమె తాను బతికి ఉండగానే, విడాకులు తీసుకోకుండా మరో పెళ్లికి ఎలా సిద్ధమయ్యావంటూ సురేంద్రను నిలదీసింది. సురేంద్రతో తనకు పదేళ్ల క్రితమే పెళ్లి అయిందని,వివాహ సమయంలో రూ.కోటి తీసుకున్నట్లు చెప్పింది.  తమకు ఆరేళ్ల పాప కూడా ఉందని ఆమె తెలిపింది. దీంతో సురేంద్ర పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయాడు. కాగా  అసలు పెళ్లి జరగలేదని పోలీసులు చెప్తున్నారు. ఉమా మహేశ్వరి ఫిర్యాదు ఇచ్చిందని, దానిపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.



ఇదిలా ఉండగా, భార్యభర్తల మధ్య విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో వీరిద్దరూ గత కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. అయితే భర్త వేధింపులు తట్టుకోలేక ఉమా మహేశ్వరి ఫిర్యాదుతో సురేంద్ర మోహన్పై హైదరాబాద్ పోలీసులు 498 కేసు కూడా నమోదు చేశారు. ఉమా మహేశ్వరి స్వస్థలం విశాఖపట్నం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top