వెంటాడుతున్న విధి

వెంటాడుతున్న విధి - Sakshi


- 10 రోజుల వ్యవధిలో భర్త, కుమార్తెను పొగొట్టుకున్న మహిళ

- మద్యం మత్తులో బైక్‌తో చిన్నారులను ఢీకొట్టిన వ్యక్తి

- ఒకరు మృతి, మరొకరికి గాయాలు

రుద్రవరం:
ఓ వైపు భర్తను కోల్పోయి విషాదంలో ఉన్న మహిళను విధి వెంటాడింది. ఈ సారి కుమార్తెను దూరం చేసి కడుపుకోత మిగిల్చింది. ఈ విషాద సంఘటన ఆలమూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మద్దయ్య, లక్ష్మీదేవి దంపతులకు పుష్పలత, భారతి, లావణ్య సంతానం. అనారోగ్యంతో మద్దయ్య 10 రోజుల క్రితం మృతి చెందాడు. ఇంకా దిన కర్మలు కూడా పూర్తి కాలేదు. భర్త పోయిన బాధలో ఉన్న లక్ష్మీదేవికి విధి ఈసారి పెద్దకుమార్తె పుష్పలతను దూరం చేసింది.



శుక్రవారం సాయంత్రం పుష్పలత(5) తన చెల్లెలు భారతితో తిను బండారాలు కొనేందుకు అంగడికి వెళ్లింది. అక్కడి నుంచి ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన ఓబులేసు మద్యం మత్తులో బైక్‌పై వేగంగా వచ్చి ఢీకొన్నాడు. గాయపడిన చిన్నారులను ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పుష్పలత మృతి చెందింది. భారతికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న రుద్రవరం ఎస్‌ఐ శేషగిరి ఆళ్లగడ్డ పట్టాణానికి చేరుకొని చికిత్స పొందుతున్న చిన్నారి భారతిని పరామర్శించారు. లక్ష్మీదేవి రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.    

 

పోలీసుల అదుపులో నిందితుడు

మద్యం మత్తులో చిన్నారిని బలిగొన్న నిందితుడు పిచ్చెల ఓబులేసును ఏఎస్‌ఐ అబ్దుల్ జలీల్ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై గ్రామస్తులు దాడి చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. నిందితుడిని రుద్రవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. చిన్నారి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top