‘సదావర్తి’లో మళ్లీ హైడ్రామా!


భూములు దక్కించుకున్న టీడీపీ నేత గడువులోగా డబ్బులు చెల్లించని వైనం 

 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సదావర్తి సత్రానికి చెందిన చెన్నైలోని 83.11 ఎకరాల అత్యంత విలువైన భూములను కారు చౌకగా కొట్టేయడానికి సర్కారు పెద్దలు సాగిస్తున్న యత్నంలో మళ్లీ హైడ్రామా చోటుచేసుకుంది. రెండవ విడత నిర్వహించిన బహిరంగ వేలంలో అత్యధిక బిడ్డర్‌గా నిలిచిన వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రధాన అనుచరుడు బద్వేలు శ్రీనివాసులురెడ్డి గడువులోగా డబ్బులు చెల్లించక పోవడం చర్చనీయాంశమైంది. సుమారు రూ.వెయ్యి కోట్ల  విలువ చేసే ఈ భూములను మళ్లీ టీడీపీ నేతలే తక్కువ ధరకు వ్యూహాత్మకంగా దక్కించుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది  సోమవారం చెన్నైలో రెండోసారి నిర్వహించిన వేలంలో టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి అత్యధికంగా రూ.60.30 కోట్లకు పాడారు.



బహిరంగ వేలం ముగిసిన 48 గంటల్లోగా వేలం పాడిన మొత్తం ధరలో 50 శాతం మేర అంటే రూ.30.15 కోట్లు దేవాదాయ శాఖకు చెల్లించాలనేది నిబంధన. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటతో ఆ గడువు ముగిసినా డబ్బులు చెల్లించలేదు.. ఈ నేపథ్యంలో బహిరంగ వేలంలో రెండో అత్యధిక ధరకు పాడిన హైదరాబాద్‌కు చెందిన చదలవాడ లక్ష్మణ్‌కు అవకాశం ఇవ్వాలని దేవాదాయ శాఖ అధికారులు యోచిస్తున్నారు. ఈయన రూ.60.25 కోట్లకు పాడారు. ఇతను కూడా భూముల కొనుగోలుకు ముందుకొచ్చినందున అతను పాడిన మొత్తంలో సగం డబ్బు చెల్లించాలని లేఖ రాసే విషయమై గురువారం నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు.



ఈ భూములు తనకే దక్కాలన్న ఆత్రంతో వేలంలో పాల్గొన్న శ్రీనివాసులురెడ్డి డబ్బు చెల్లించడానికి ముందుకు రాకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల  ఎత్తుగడలే కారణమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై దేవాదాయ శాఖ మంత్రి ఒక రకంగా, ఆ శాఖ అధికారులు మరో రకంగా మాట్లాడుతుండటం అనుమానాలకు తావిస్తోంది. సోమవారం వేలం ముగిశాక ‘ఈ భూములు మంచి విలువైనవి. సర్వే కూడా చేశాం. అన్ని విషయాలు తెలుసుకునే వేలం పాడాం’ అని మీడియా ఎదుట చెప్పిన  శ్రీనివాసులురెడ్డి.. ఇపుడు  ముఖం చాటేయడం ఈ అనుమానాలకు  బలం చేకూరుస్తోంది.



వేలంలో తొలి బిడ్డర్‌గా నిలిచిన వ్యక్తి నిర్ణీత గడువులోగా డబ్బులు చెల్లించకుండా వైదొలిగారని, అతని చేతనే డబ్బులు కట్టించాలని కోర్టును కోరతామని దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు చెప్పారు. సుప్రీంకోర్టు సూచన మేరకు వేలం ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి డబ్బులు కట్టకపోతే రెండో స్థానంలో ఉన్న వారికి అవకాశం ఇవ్వలేమన్నారు. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి న్యాయస్థానం ఏమి చేయాలో నిర్ణయిస్తుందని చెప్పారు.   
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top