అబ్బాయిపై బాబాయి పరోక్ష విమర్శలు
టీడీపీ తరఫున ప్రచారం చేయమని ఎవరిని బొట్టుపెట్టి మరీ పిలవాల్సిన అవసరం లేదని ప్రముఖ నటుడు బాలకృష్ణ తన అన్న కుమారుడు జూనియర్ ఎన్టీఆర్పై పరోక్షంగా విమర్శించారు. తన తరఫున తమ బాధ్యతగా టీడీపీ గెలుపు కోసం నందమూరి కుటుంబసభ్యులందరూ కలసి ప్రచారం చేయాలని ఆకాంక్షించారు. బుధవారం బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
అనంతరం విలేకర్లతో బాలకృష్ణ మాట్లాడారు. ఈ సందర్బంగా మీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ పై విధంగా సమాధానం చెప్పారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బాలకృష్ణ బెంగళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా హిందూపురం చేరుకున్నారు. నామినేషన్ దాఖలు చేసే ముందు హిందూపురంలోని సుగూరు ఆంజనేయస్వామి దేవాలయంలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి బాలకృష్ణ నామినేషన్ వేశారు.