తిరుమలలో హెరిటేజ్ దుకాణం

తిరుమలలో హెరిటేజ్ దుకాణం


సీఎం సొంత సంస్థకు నిబంధనల నుంచి మినహాయింపు

సాక్షి, హైదరాబాద్: హెరిటేజ్ సంస్థ కోసం చిత్తూరు విజయ డెయిరీని నిర్వీర్యం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం చంద్రబాబునాయుడు.. ఈ దఫా తిరుమలలో తమ కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలకు తెరలేపారు. టీటీడీలోని సంబంధిత శాఖల అధికారులకు కూడా తెలియకుండా, హెరిటేజ్‌కు దుకాణం కేటాయిస్తూ టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ నిర్ణయం తీసుకునేలా బాబు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.



దీంతో ఆగమేఘాల మీద తిరుమలలో ఆ కంపెనీ దుకాణం వెలసింది. వారం రోజులుగా ఇక్కడ పాల ఉత్పత్తులతో పాటు ఇతర తినుబండారాల అమ్మకం కొనసాగిస్తోంది. వాస్తవానికి తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా సదుపాయాల కల్పన కోసం టీటీడీ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఇందులో తమ ఇళ్లు, దుకాణాలు, స్థలాలు పోగొట్టుకున్న స్థానికులకు మాత్రమే టీటీడీ పునరావాసం కింద దుకాణాలు, ఇళ్లు కేటాయించాలనే స్పష్టమైన నిబంధన ఉంది.



1983లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో మాస్టర్ ప్లాన్ అమలైంది. చంద్రబాబు సీఎం అయ్యాక 1996 నుంచి 2003 వరకు ప్రణాళికను వేగంగా అమలు చేశారు. అందులో తమ ఇళ్లు, దుకాణాలు, ఆస్తులు కోల్పోయిన బాధితులు.. పునరావాసం కోసం దశాబ్దాలుగా టీటీడీ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. కానీ చంద్రబాబు పదవిలోకి రాగానే వారి సమస్యలు పరిష్కరించకుండా.. తమ కుటుంబానికి చెందిన హెరిటేజ్ పాల ఉత్పత్తులకు తిరుమలలో ప్రచారం కల్పించే యోచన చేశారు.



ఇంకేముందీ టీటీడీ ఉన్నతాధికారులు ఆగమేఘాలపై రంగంలోకి దిగారు. పంచాయితీ, రెవెన్యూ విభాగాలకు  తెలియకుండానే టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ మాజీ చైర్మన్ జేఎస్ శర్మ, మాజీ ఈవో ఎంజీ గోపాల్ నేతృత్వంలో దుకాణం నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. దీనిపై అన్ని వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top