ఏపీ సీఎం తీరుపై హజ్ యాత్రికుల ఆగ్రహం
► వెలగపూడి సచివాలయంలో 3 గంటలపాటు యాత్రికుల అవస్థలు
► హైదరాబాద్ చేరుకుని గగ్గోలు పెట్టిన వైనం
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై హజ్ యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం సీఎం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే సీఎం చంద్రబాబు యాత్రికులు వెళ్లే ప్రాంతానికి వెళ్లకుండా వారినే వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలోని తన కార్యాలయానికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
దీంతో గురువారం ఆంధ్ర హజ్ కమిటీ సభ్యులు, అధికారులు, కృష్ణా, గుంటూరు జిల్లాల యాత్రికులను బస్సుల్లో సీఎం కార్యాలయానికి తీసుకొచ్చారు. యాత్రికులను కలవడానికి, జెండా ఊపి యాత్రను ప్రారంభించడానికి సీఎం మూడు గంటలు ఆలస్యంగా వచ్చారు. దీంతో నానా అవస్థలు పడ్డామని హైదరాబాద్ చేరుకున్నాక యాత్రికులు గగ్గోలు పెట్టారు. కాగా, 450 మందితో కూడిన ఆంధ్ర యాత్రికుల మొదటి బృందం శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు హజ్యాత్రకు వెళ్లిందని తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఏ. షుకూర్ తెలిపారు. 450 మందితో కూడిన రెండో బ్యాచ్ శనివారం రాత్రి 10.30 గంటలకు వెళ్లిందని చెప్పారు.