గురుపూజోత్సవం గుంటూరులో..
గుంటూరు క్రైం : గురుపూజోత్సవాన్ని ఈ నెల 5న గుంటూరులో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అవసరమైన ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. నగరంలోని పోలీస్ కవాతు మైదానం ఇందుకు వేదికగా నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరుకానుండడంతో పటిష్ట భద్రత ఏర్పాటుకు పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్ కుమార్ ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఇప్పటికే సిబ్బందిని అప్రమత్తం చేశారు.ఏఎస్పీ బి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో డీఎస్పీలు కె.నరసింహా, డి.గంగాధరంలు మంగళవారం పోలీస్ కవాతు మైదానాన్ని పరిశీలించారు. తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.తొలుత ఈ కార్యక్రమాన్ని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించాలని ప్రభుత్వం భావించింది.
విద్యాశాఖ ఉన్నతాధికారులు, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సోమవారం యూనివర్శిటీలో పర్యటించి వసతులు, కార్యక్రమాలు జరిగే ప్రాంగణం, భద్రతా ఏర్పాట్లపై అధికారు లతో చర్చించారు. అయితే ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేదికను గుంటూరులోని పోలీస్ కవాతు మైదానంలోకి మార్పు చేశారు.
5న ముఖ్యమంత్రి రాక
గురుపూజోత్సవ కార్యక్రమానికి ఈ నెల 5న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు రానుండడంతో నగరంలో పోలీస్ నిఘా పెంచారు.ప్రధాన కూడళ్లలో అదనపు పోలీస్లను సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పిస్తున్నారు.
రేంజ్ ఐజీ పీవీ సునీల్ కుమార్ జిల్లా ఎస్పీలతో మగళవారం ఫోన్లో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అవసరమైన అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్ శిక్షణకు వెళ్లనున్న దృష్ట్యా ముఖ్యమంత్రి తిరిగి వెళ్లే వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని రూరల్ ఎస్పీ రామకృష్ణకు సూచించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయాలన్నారు. నూతన వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.