భూమి ఇవ్వమంటే చిత్రహింసలు పెడుతున్నారు
జగన్మోహన్రెడ్డి ఎదుట రాజధాని ప్రాంత రైతుల గోడు
తణుకు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తమకు జీవనాధారమైన భూమిని ఇవ్వలేమని చెబుతుంటే చిత్రహింసలు పెడుతున్నారని రాజధాని ప్రాంత రైతులు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమను భయభ్రాంతుల్ని చేసి లొంగదీసుకోవాలని చూస్తున్నారని వాపోయారు.
నిడమర్రు, పెనుమాక, ఉండవల్లి గ్రామాలకు చెందిన 30 మంది రైతుల బృందం ఆదివారం తణుకులో జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతు దీక్షా వేదికపై ఆయన్ని కలిసి తమ ఆవేదన వెలిబుచ్చారు. రైతులు ముప్పెర శ్రీనివాసరావు, బొక్కా ప్రసన్నకుమార్, గుంటక నరేష్రెడ్డి, మేకా భాస్కర్రెడ్డి, మర్రెడ్డి శివరామిరెడ్డి తదితరులు ప్రభుత్వ యంత్రాంగం తమను అనేక ఇబ్బందులు పెడుతోందన్నారు.
దీక్షా వేదికపై రాజధాని ప్రాంత రైతు ప్రతినిధి అంకమరెడ్డి తమకు అండగా నిలవాని జగన్ను కోరారు. జగన్ వారితో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, భూములను రైతుల వద్ద నుంచి బలవంతంగా లాక్కునే విధానానికి తాము వ్యతిరేకమని చెప్పారు. అండగా ఉంటామని చెప్పారు.